– సీఏఏ నిరసనకారులపై పోలీస్ చర్య దారుణం
– కేవలం ముస్లింలకు సంబంధించిన అంశం కాదు : ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా గళమెత్తినవారిపై ఈతీరుగా పాలకులు అణిచివేత చర్యలకు దిగటం…బ్రిటిష్ వలసపాలనలో కూడా జరగలేదని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ అన్నారు. నిరసనలు, ఆందోళనలు కేవలం ముస్లింలకు సంబంధించిన అంశం కాదనీ, ఇది ఆధునిక భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందనీ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ జాతీయ ఆంగ్లదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నిరసనకారులపై జరుగుతున్న పోలీస్ దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ విధానాలపై, నిర్ణయాలపై ప్రజస్వామ్యంలో ఎవరైనా ఆందోళన వ్యక్తం చేయవచ్చునని అన్నారు. దేశంలో జరుగుతున్న నిరసనల్లో మతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొంటున్నారని చెప్పారు. ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి…
ఇలాగే కొనసాగితే…ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం
హిందూత్వం చుట్టూ మెజార్టీ ప్రజల్ని తిప్పేందుకు…సుదీర్ఘకాలం ప్రభావం ఉండేట్టు..ఒక వ్యూహం ప్రకారం మోడీ సర్కార్ నిర్ణయాలు ఉంటున్నాయి. మతపరమైన ప్రజల భావేద్వేగాల చుట్టూ మన పాలకుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా గురించి, ఈదేశ భవిష్యత్తు ప్రజాస్వామ్యం గురించి పోరాటం జరుగుతుందని నేను అనుకుంటున్నా.
వర్సిటీల్లో పోలీసు దాడులా?
అలీగర్ ముస్లిం వర్సిటీలో 1938లో ఇలాగే పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. దాంట్లో బ్రిటిష్వాడైన జిల్లా ఎస్పీ అధికారి గాయపడ్డాడు కూడా. అయినప్పటికీ వర్సిటీ లోపలికి పోలీసుల్ని ఆయన పంపలేదు. 1951లోనూ విద్యార్థుల నిరసనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు కూడా ఏ ఒక్కరిపైనా పోలీసులు దాడిచేయలేదు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న వర్సిటీలో 15 డిసెంబరు రాత్రి పోలీసులు అత్యంత పాశవికంగా విద్యార్థులపై దాడి జరిపారు.
(Courtesy: NT)