– బీజేపీ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు
బెంగళూరు : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో పద్యం పాడారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకుడి ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై పోలీసు లు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొప్పల్ జిల్లాలో గతనెలలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కవి సిరాజ్ బిసరళ్లి పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో భాగంగా సిరాజ్.. సీఏఏ వ్యతిరే క పద్యాన్ని వినిపించారనీ, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ఎడిటర్ అయిన రాజా బాక్సీ దానిని సామాజిక మాద్యమంలో షేర్ చేశారని ఒక బీజేపీ కార్యకర్త తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. సిరాజ్చ, రాజాబాక్సీల బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ అంశంపై దర్యాప్తు జరపాల్సిందిగా వారిద్దరినీ పోలీసు కస్టడీకి పంపింది. సీఏఏ నిరసనల్లో పాల్గొన్నందుకు ఒక కవికి యూపీలోని యోగి సర్కారు దాదాపు కోటి రూపాయలను చెల్లించాలంటూ నోటీసులు పంపిన విషయం మరవకముందే.. బీజేపీ పాలిత కర్నాటకలో యడియూరప్ప సర్కారు కవి, జర్నలిస్టులపై కేసులు బనాయించడం గమనార్హం.
Courtesy: NT