-నేడు జనతా కర్ఫ్యూ
-జనమంతా ఇండ్లకే పరిమితం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్ నడుం బిగించింది. జనతా కర్ఫ్యూతో సమరశంఖం మోగించింది. వైరస్ను కట్టడి చేసేందుకు ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతావని ఇందుకు సిద్ధమైంది. జనతా కర్ఫ్యూకు వివిధ రాష్ర్టాలు చర్యలు చేపట్టాయి. ఆదివారం బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ సహా అనేక వాణిజ్య సంఘాలు జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్ రైళ్లను నడుపబోమని రైల్వే ప్రకటించింది.
ఒక్కరోజు సరిపోదు..
ప్రధాని ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ప్రజలు మరిన్ని రోజులు ఇండ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా ఇంకా రెండో దశలోనే ఉన్నది. సమూహ వ్యాప్తి ఇంకా చేరలేదు. ఆ దశకు చేరకుండా దాన్ని అడ్డుకోవాలంటే ‘సామాజిక దూరం’ పాటించడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.
Courtesy Namasthe Telangana