– ఫోన్ ద్వారా ఉచిత ఓపీ సేవలు
– రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగం
– 040-48214595 హెల్ప్లైన్కు పెరుగుతున్న ప్రజాదరణ
– ప్రజాసేవలో పలువురు డాక్టర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు
అసలే కరోనా భయం. ఆపై లాక్డౌన్. వెన్నాడుతున్న అనారోగ్య సమస్యలు. తమ సమీప ప్రాంతాల్లో పనిచేయని క్లినిక్లు. సుదూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఔట్ పేషెంట్(ఓపీ) సేవలను అందిస్తూ ‘ప్రజారోగ్య వేదిక’ కొండంత అండగా నిలుస్తున్నది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కార మార్గాలు చూపుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భరోసానిస్తున్నది. ఆపత్కాలంలో ప్రజాసేవ చేయాలనే కొందరు సాఫ్ట్వేర్ ఔత్సాహికులు, డాక్టర్ల ఆలోచనతో 040-48214595 ఉచిత హెల్ప్లైన్ ద్వారా ప్రజాదరణను చూరగొంటున్నది.
హైదరాబాద్, పలు ప్రాంతాల్లో ఉన్న 40 మంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, 108 మంది డాక్టర్లు కలిసి ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ముందుకొచ్చారు. జనవిజ్ఞాన వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ప్రజారోగ్య వేదిక ద్వారా తమ పనిని గురువారం మొదలు పెట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి ఇండ్లల్లో వారు ఉంటూ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్నారు. హెల్ప్లైన్ ద్వారా ఓపీ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే 300కుపైగా ఫోన్కాల్స్ వచ్చాయి. ఎక్కువగా గర్భిణులు, చిన్నపిల్లలు, ఆర్థ్రోపెడిక్, ఈఎన్టీ సమస్యలకు సంబంధించినవే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రోగులు, వారి కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా అడుగుతున్న ప్రశ్నలను డాక్టర్లు ఓపికగా వింటున్నారు. వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి నోట్ చేసుకుంటున్నారు. సమస్యను ఏవిధంగా పరిష్కారం చేసుకోవచ్చునో సలహాలు ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మెడిసిన్ ప్రిస్కిప్షన్ను వాట్సాప్, మెసేజ్రూపంలో పంపిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే సామాన్య ప్రజానీకానికి తక్కువ ధరలో జనరిక్ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందో సూచిస్తున్నారు. విలువైన సూచనలతో పాటు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చునో డాక్టర్లు చెబుతున్న తీరుకు ప్రజలు ఫిదా అవుతున్నారు.
కరోనా టెన్షన్! : కరోనా రహిత వైద్య సేవలను అందిం చేందుకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు తమకు ఎక్కడ కరోనా సోకిందోనన్న భయంతో ఫోన్లు చేస్తు న్న వారు కూడా ఉన్నారు. ఎక్కువ మంది ప్రజలు జర్వం వచ్చినా జలుబు చేసినా దగ్గు లేసినా తెగ హైరానా పడిపో తూ భయపడిపోతున్న పరిస్థితి కాల్స్ ద్వారా కనిపించింది. డాక్టర్లు రోగులకు పలు జాగ్రత్తలు సూచిస్తూనే భయపడా ల్సిన అవసరం లేదనే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. సాధారణ జ్వరంతో బాధపడేవారు కూడా తమకు కరోనా వచ్చిందనే భయంతో వణికిపోతున్నారు. మానసికంగా కుం గిపోతున్నారు.
అలాంటి వారిలో డాక్టర్లు ధైర్యాన్ని నూరిపో స్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న ఓ రైల్వే ఉద్యోగి ఫోన్చేసి ఆందోళనకు గురికాగా…పలు జాగ్రత్తలు సూచించి అతనిలో డాక్టర్లు భరోసా నింపారు. తమ బాబు చికెన్ ఫాక్స్తో ఇబ్బంది పడుతున్నాడనీ ఓ తండ్రి ఫోన్ చేయగా…ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…ఏ మెడిసిన్ వేసుకోవాలనే సూచనలను చిన్నపిల్లల డాక్టర్ చేశారు.
హెల్ప్లైన్ను అందరూ వినియోగించుకోండి : కిరణ్చంద్ర, సాఫ్ట్వేర్ నిపుణులు
కరోనా నేపథ్యంలో వైద్య సేవలు పొందడం చాలామందికి సమస్యగా మారింది. పలు వ్యాధులతో బాధపడుతున్నవారు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. చిన్న చిన్న సలహాలు, జాగ్రత్తలు, మెడిసిన్తో వాటిని పరిష్కరించవచ్చు ను. ప్రజారోగ్య వేదికగా మేం అదే పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు 040-48214595కు ఫోన్ చేసి డాక్టర్లను తమ ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం.
ప్రజలు ఇబ్బందిపడొద్దనే హెల్ప్లైన్ ద్వారా వైద్యసేవలు : డాక్టర్ రమాదేవి,ప్రముఖ వైద్య నిపుణులు
క్వారంటైన్ పిరియడ్ కావడంతో కరోనా భయంతో క్లినిక్ల న్నీ మూతపడ్డాయి. గాంధీతోపాటు పలు పెద్దాస్పత్రుల్లోనూ ఓపీ సేవలను నిలిపేశారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారికి చూసే డాక్టర్లు నేడు అందుబాటులో లేకుండా పోయారు. లాక్డౌన్తో బయటకు వెళ్లలేని పరిస్థితి. తమ సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసి కరోనా కాకుండా ఇతర అనారోగ్య సమస్యల గురించి స్వీకరిస్తున్నాం. రోగులతో మాట్లాడి, వారి కేసు హిస్టరీని పరిశీలించి ప్రిస్కిప్షన్ను వాట్సాప్, మెసేజ్ల రూపంలో పంపుతున్నాం. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది.
Courtesy: NT