న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత దేశంలో వైద్యరంగంలోని డొల్లతనం మరోసారి బయటపడింది. భారతీయులకు కనీన స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని తేలింది. మార్చి 17 వరకు ఉన్న కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం చూస్తే 84 వేల మందికి ఒకే ఒక్క ఐసోలేషన్ బెడ్ అందుబాటులో ఉంది. 36 వేల మందికి కేవలం ఒక క్వారంటైన్ బెడ్ మాత్రమే ఉంది. మన దేశంలో 11,600 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడు. 1,826 మందికి ఒక ఆస్పత్రి ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక దూరం, జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు సరిపడా వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా వైద్య రంగంలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
మనదేశంలో కోరనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉందని, ఈ దశలో సామాజిక దూరం పాటించడం వల్ల వైరస్ విస్తరణను చాలా వరకు నివారించవచ్చని ఐసీఎంఆర్- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. మూడో దశలో లాక్ డౌన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. మౌలిక వసతులు అరకొరగా ఉన్న నేపథ్యంలో జనతా కర్ఫ్యూ లాంటి చర్యల వల్ల ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇంతకంటే మార్గం లేదని అభిప్రాయపడ్డారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన దేశంలో 1,154,686 రిజిస్టర్డ్ అల్లోపతి వైద్యులు ఉన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 7,39,024 బెడ్ లు అందుబాటులో ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఇవి ఏమాత్రం సరిపోవయని వైద్య నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 నివారణ చర్యలో ప్రైవేటు ఆస్పత్రులు భాగంగా కానందున ప్రభుత్వ ఆస్పత్రులోని బెడ్ లు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి.