– ఢిల్లీలో కొనసాగుతున్న సీఏఏ ఆందోళనలు
న్యూఢిల్లీ బ్యూరో
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా జాబితా (ఎన్పీఆర్), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ రాజధాని హస్తినలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం కూడా ఆందోళనలు జరిగాయి. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో జరిగిన ఆందోళనలో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త అరుంధతి రారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్పీఆర్, ఎన్నార్సీల వ్యతిరేక నిరసనలకు దేశ రాజధాని కేంద్ర బిందువు అయిందన్నారు. విద్యార్థులు, పౌర సమాజంపై పోలీసుల దాడికి ఢిల్లీ నగరం ఒక సాక్ష్యంగా ఉందన్నారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్గా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రెండింటిని దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఎన్నార్సీ తెచ్చారని విమర్శించారు. ఎన్నార్సీని బీజేపీ సర్కార్ ఎజెండాగా పెట్టుకుందన్నారు.
ఎన్నార్సీని దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా చాలా సార్లు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మోడీ, అమిత్ షా వేర్వేరు ప్రకటనలతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో శాంతియుత నిరసనకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 24/7 నాన్ స్టాప్ మౌన దీక్ష బుధవారం కూడా కొనసాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో భాగస్వాములయ్యారు. కుటుంబాలపై ఎన్నార్సీ వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని మహిళలు చెప్పారు. హుమేరా సయీద్ (22) ఈ నిరసనలో కీలకపాత్ర పోషిస్తున్నారు
(Courtesy: NT)