పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– అసోం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్‌లలో ఉద్రిక్తత
ప.బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌,
– ఇతర భవనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
– షిల్లాంగ్‌లో నిరసనకారులపైకి కాల్పులు, టియర్‌గ్యాస్‌
– ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి
– కేంద్ర హోమంత్రి అమిత్‌షా పర్యటన రద్దు
– జపాన్‌ ప్రధాని, బంగ్లాదేశ్‌ మంత్రుల భారత్‌ పర్యటన క్యాన్సిల్‌ !
– చట్టాన్ని తప్పుపట్టిన ఐక్యరాజ్యసమితి

‘పౌరసత్వ సవరణ చట్టం, 2019’కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. పెద్దసంఖ్యలో యువత, విద్యార్థులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపడుతున్నారు. శాంతియుతంగా జరుగుతున్న వారి ర్యాలీలపై పోలీసులు బలప్రదర్శనకు దిగటం ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. లాఠీచార్జీలో గాయపడ్డవారిలో మరోవ్యక్తి
శుక్రవారం హాస్పిటల్‌లో మృతిచెందాడు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జీ నేపథ్యంలో అసోం, మేఘాలయ, త్రిపురలో పరిస్థితి రణరంగంగా మారింది. ఢిల్లీలోని జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం షిల్లాంగ్‌ వెళ్లాల్సిన కేంద్ర హోమంత్రి అమిత్‌షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ మంత్రులు తమ పర్యటనను రద్దు చేసుకోగా, జపాన్‌ ప్రధాని కూడా క్యాన్సిల్‌ చేసుకునే యోచనలో ఉన్నట్టు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : షిల్లాంగ్‌, దిబ్రుగఢ్‌, గువహతి…ఈశాన్య రాష్ట్రాల్లోని పలు నగరాల్లో నిరసనల హోరు కొనసాగుతున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోం సహా త్రిపుర, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్టాల్లో ప్రజలు ప్లకార్డులతో, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. సామాజిక మాధ్యమాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఎస్‌ఎంఎస్‌, యూట్యూబ్‌, ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శుక్రవారం చలో రాజ్‌భవన్‌ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ జరిపారు. టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈనేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. విదేశీ మంత్రులు, ప్రతినిధుల భారత పర్యటనపై ఆందోళనలు తీవ్ర ప్రభావం చూపాయి. బంగ్లాదేశ్‌ మంత్రులు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన కూడా వాయిదా పడినట్టు తెలిసింది.
పరిస్థితి మరింత దిగజారింది..

అసోం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో శుక్రవారం ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గువహటి, దిబ్రుగఢ్‌, షిల్లాంగ్‌…తదితర చోట్ల నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపటం, లాఠీచార్జ్‌కు దిగటం…పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. గురువారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. 11మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప.బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు
ప.బెంగాల్‌లోనూ ఆందోళనలు, నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. బెల్‌దంగా రైల్వే స్టేషన్‌కు, పక్కనున్న రైల్లే భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో రాష్ట్రంలో కొన్ని రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో ఉండిపోవాల్సి వచ్చింది. హౌరా-చెన్నై కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా-డిఘౌ కాందారీ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లించడంతో అవి ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

జపాన్‌ ప్రధాని పర్యటన రద్దు!
బంగ్లాదేశ్‌ హోంమంత్రి, విదేశాంగ మంత్రులు తమ భారత పర్యటనలను రద్దు చేసుకున్నారు. తాజాగా జపాన్‌ ప్రధాని షింజో అబే కూడా తన పర్యటనను రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్టు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో షింజో అబే పర్యటన ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అసోం రాజధాని గువహటి వేదికగా భారత ప్రధాని మోడీ, షింజో అబే భేటీ కానున్నట్టు గతంలో అధికారులు వెల్లడించారు. అసోంలో ఆందోళనలు జరుగుతున్న కారణంగా, షింజో అబే…తన భారత పర్యటనపై పునరాలోచిస్తున్నారనీ, రద్దు చేసుకునే యోచనలో ఉన్నారనీ జపాన్‌కు చెందిన ‘జిజి’ మీడియా వార్తా కథనం పేర్కొన్నది. కాగా…దీనిపై భారత విదేశంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ స్పందిస్తూ, అబే పర్యటన రద్దుపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.

పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు
చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌జీయుఎస్‌యు), స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజినల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (సన్‌) విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరి వెళ్లాయి. విద్యార్థులకు తోడుగా స్థానిక ప్రజలు, అస్సామీ గిరిజన తెగలు జతకలిశాయి. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముస్లింలపై వివక్షే : ఐక్యరాజ్య సమితి
నూతన పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని ఐరాస మానవ హక్కుల కార్యాలయం పిలుపునిచ్చింది. ‘భారత్‌ తీసుకొచ్చిన కొత్త పౌరసత్వ చట్టం ప్రాథమికంగా వివక్షతో కూడుకున్నది. దీనిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామ’ని ఐరాస మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి లారెన్స్‌ అన్నారు. ఈ చట్టం ముస్లిం మినహాయించి, మరో ఆరు మతాల వారికి రక్షణ కల్పించడం మంచిదైనప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని బలహీన పరుస్తుందని వెల్లడించారు. దేశ రాజ్యాంగంలోని అంశాల పట్ల భారత్‌ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.

మైనార్టీల హక్కుల్ని పరిరక్షించండి : అమెరికా
‘పౌరసత్వ సవరణ చట్టం, 2019’పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తిన పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మతస్వేచ్ఛ, సమానత్వం భారత్‌, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అమిత్‌ షా పర్యటన రద్దు
ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా షిల్లాంగ్‌ పర్యటన రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం, ఈ ఆదివారం షిల్లాంగ్‌లోని ఈశాన్య పోలీస్‌ అకాడమీని అమిత్‌ షా సందర్శించాల్సి ఉంది. సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. కాగా, ఈ పర్యటనలను షా రద్దు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం చెప్పలేదు. అయితే శనివారం, సోమవారం ఆయన జార్ఖాండ్‌లో పర్యటించ నున్నట్టు తెలిపారు.

Courtesy Nava telangana…

RELATED ARTICLES

Latest Updates