- 42 రోజులుగా ఆస్పత్రిలోనే.. ఇన్ఫెక్షన్ లక్షణాలు శూన్యం
- కేరళలో చికిత్స పొందుతున్న 62 సంవత్సరాల వృద్ధురాలు
తిరువనంతపురం: కేరళలోని పథనంతిట్ట జిల్లాకు చెందిన 62 ఏళ్ల మహిళ కరోనా బారిన పడి.. 42 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇటలీ వెళ్లొచ్చిన కుటుంబసభ్యుల ద్వారా ఆమెకు వైరస్ సోకింది. మార్చి 10న ఆమెకు పరీక్షలు చేయించారు. పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మామూలుగా చాలామంది 14 నుంచి 21 రోజుల వ్యవధిలో చికిత్సకు స్పందిస్తారు. కానీ, ఆమెకు ఇన్నాళ్లుగా చికిత్స చేస్తున్నా ఫలితం లేదు. ఇప్పటికి 19సార్లు ఆమెకు వైద్యపరీక్షలు చేయగా.. ప్రతిసారీ పాజిటివే వచ్చింది. అలాగని ఆమెలో దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమీ లేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు రకరకాల మిశ్రమాల్లో ఔషధాలను వాడి చూస్తున్నామని చెప్పారు. మరోసారి ఆమెకు పరీక్ష చేస్తామని.. అప్పుడు కూడా పాజిటివే వస్తే ఆమెను కొట్టాయంలోని వైద్య కళాశాలకు తరలిస్తామని వారు పేర్కొన్నారు.
Courtesy Andhrajyothi