– 10 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరం
– తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేదా? అయితే అడ్మిషన్లు కూడా లేవు అంటూ పాఠాశాలలు నిరాకరించడంతో లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆధార్ కార్డు లేదనే కారణంతో దేశంలో పదిలక్షల మంది పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించబడిందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.
‘స్టేట్ ఆఫ్ ఆధార్ రిపోర్ట్-2019’ విశ్లేషణతో పాటు, క్షేత్రస్థాయి పరిశోధన జరిపి ‘అడ్వైజరీ గ్రూప్ డెల్బర్గ్’ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఆధార్ లేదని దాదాపు 10 లక్షలకు పైగా పిల్లలకు స్కూళ్లలో ప్రవేశం లభించలేదు. ఐదు రాష్ట్రాల్లోని 75శాతం మంది విద్యార్థులు ఇంకా తమ ఆడ్మిషన్కు సంబంధించి ఆధార్ కార్డును అందజేయాల్సి ఉన్నది. ఆధార్ అందజేయకుండా ప్రవేశం పొందిన పిల్లలు ఇప్పటికీ.. వాటి వివరాలు అందించాలనీ, లేకుంటే అడ్మిషన్ రద్దవుతుందంటూ బెదిరింపులకు గురవుతున్న వారు లక్షల్లో ఉన్నారు. అలాగే ఆధార్ కార్డు తప్పనిసరి అనే నిబంధనతో 73 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. వీరిలో 13 శాతం మంది పిల్లలు ప్రవేశం పొందే సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దేశ జనాభాలో 90 శాతం మందికి ఆధార్ ఉండగా, 8శాతం మందికి లేదనీ, మిగతా వారి వివరాలు అందుబాటులో లేవని నివేదిక పేర్కొంది. అయితే ఆధార్ లేని వారిలో 7.5 కోట్ల మంది పిల్లలు ఉండగా, వారిలో 2.5 కోట్ల మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆధార్లేకపోవడంతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారిలో బాలలు అధికంగా ఉన్నారని నివేదిక తేల్చింది. ఆధార్ లేని కారణంగా మధ్యాహ్న భోజన పథకం, పోషకాహారం అందించడంతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలను పొందలేకపోయారని నివేదిక వెల్లడించింది.
కాగా, చట్టంలోని నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఆధార్ లేదనే కారణంతో పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించకూడద’ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది వరకే తెలిపింది. అలాగే ఆధార్కు సంబంధించి 2018లో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. పాఠశాలలు, పాఠశాలలు, బ్యాంకులు, బీమా సంస్థలు, టెలికాం కంపెనీలు వంటి సంస్థల సేవలు పొందే విషయంలో ఆధార్ను తప్పనిసరి అందించాల్సిన అవసరం లేదంటూ’ వ్యాఖ్యనించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం, అలాగే పాఠశాలల అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం చొరవచూపకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నివేదిక తెలిపింది.
Courtesy Nava telangana…