- బీజేపీపై మహా అగాడీ ఫైర్..
- విచారణకు ఆదేశం
ముంబై: ఎన్సీపీ, కాంగ్రెస్ సీనియర్ నేతల ఫోన్లను గత బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ మహారాష్ట్ర వికాస్ అగాడీ(ఎంవీఏ) నేతలు ఆరోపించారు. వీటిపై హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ దర్యాప్తునకు ఆదేశించారు. అప్పటి ప్రభుత్వం కొందరు అధికారులను ఇజ్రాయెల్కు పంపి, ఫోన్లను ట్యాప్ చేసే సాఫ్ట్వేర్ తెప్పించిందనే ఆరోపణలు కూడా తన దృష్టికి వచ్చాయని దేశ్ముఖ్ వెల్లడించారు. బీజేపీ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అంతకుముందు గృహశాఖ మంత్రి జితేంద్ర అవాద్ ఆరోపణలు గుప్పించారు. ట్యాపింగ్ వెనుక ఎవరి హస్తం ఉన్నదో వెలికితీస్తామని చెప్పారు. తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని బీజేపీ నేత ఒకరు తనకు చెప్పారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ ఆరోపణలను మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తోసిపుచ్చారు. అలాంటి సంస్కృతి తమకు లేదని.. దీనిపై సర్కారు దర్యాప్తు జరుపుకోవచ్చన్నారు. ట్యాపింగ్కు సంబంధించి తమ సర్కారు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పవార్ ఇంటికి భద్రత తొలగింపు : ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటి వద్ద భద్రతను కేంద్రం తొలగించింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే భద్రతను తొలగించారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకే పవార్కు కేంద్రం భద్రత తగ్గించిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
Courtesy Andhrajyothi