సూరత్: తమ పట్ల పాలకులు చూపుతున్న అలసత్వం పట్ల వలస కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. మోదీ సర్కారు తీరుపై బడుగు జీవులు భగ్గుమంటున్నారు. తాజాగా గుజరాత్లోని సూరత్లో వలస కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయకుండా పాలకులు తాత్సారం ప్రదర్శిస్తుండటంతో వలసజీవులు సూరత్ శివారులోని వరేలీ గ్రామంలో ఆందోళన చేపట్టారు.
తమను పట్టించుకోమని నిరసనకు దిగిన బడుగులపై పోలీసులు ప్రతాపం చూపారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కడుపు మండిన వలస కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సూరత్-కడోదర మార్గంలో పార్క్ చేసిన పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. తమను సొంతూళ్ల తరలించాలని కోరుతూ సూరత్లోని పాలన్పూర్ పటియా ప్రాంతానికి వేల సంఖ్యలో వలస కార్మికులు తరలివచ్చారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
తమను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనందుకు నిరసనగా సూరత్లోని పాండేసర ప్రాంతంలో యూపీ, జార్ఖండ్కు చెందిన 50 మంది వలస కార్మికులు శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం బస్సుల్లో వెళ్లడానికి అనుమతి ఇచ్చి తర్వాత అడ్డుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.