సామాజిక ఉద్యమ కారుడు, రచయిత కసుకుర్తి రామలింగం 9 అక్టోబర్ 2019 ఉదయం హైదరాబాద్ నుండి ఆంధ్ర వెళ్ళటానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కేటప్పుడు కాలు జారి ట్రైన్ కి, ప్లాట్ఫాంకి మధ్య పడి యాక్సిడెంట్ కి గురై తొంటి ఎముక, పక్కటెముకలు, వెన్నెముక ఫ్రాక్చర్ కావటం జరిగింది. అలాంటి ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ లో చేర్చి అన్నిరకాల వైద్య సదుపాయాలు సమకూర్చినా ప్రాణాలు కాపాడుకోలేకపోవడం విచారకరం. అక్టోబర్ 17 ఉదయం. 11 గంటలకు ఈ వార్త తెలియడంతో వెంటనే నిమ్స్ కి వెళ్లిన ‘’దేశీదిశ’’ టీం మృతదేహాన్ని సందర్శించటం జరిగింది. ఈ వార్తని దేశీదిశ ప్రేక్షకులకి, వీక్షకులకి అందిస్తోంది.
క్లుప్తంగా రామలింగం నేపధ్యం: రామలింగం దళిత ఉద్యమాలకు పుట్టినిలైన ప్రకాశం జిల్లా, అనంతారం గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 49 సం.లు. అతని కుటంబసభ్యులు భార్య – ముగ్గురు మగపిల్లలు. ప్రాథమిక విద్య, స్కూలు, కాలేజి విద్య ప్రకాశం జిల్లాలో సాగిన తదనంతంరం ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యనభ్యసించడం జరిగింది. రామలింగం విద్యార్ధి దశలోనే విద్యార్థి ఉద్యమ నేతగా ఎదిగి PDSU నాయకుడిగా గుర్తింపు పొందాడు. PDSU అధినేతగా, కుల-వర్గ జమిలిపోరాట సామజిక విప్లవ నేతగా, CPUSI వ్యవస్థాపక కార్యదర్శిగా చరిత్ర సృష్టించిన అమరుడు మారోజు వీరన్న దేశీదిశ విప్లవ బాటలో నడిచిన (వీరన్న) సహచరుడిగా రామలింగం చారిత్రాత్మక పాత్ర నిర్వహించాడు. వీరన్న మరణానంతరం ”శోషిత జనసభ”నేతగా తన ఉద్యమ జీవితాన్ని కొనసాగించాడు. సామజిక ఉద్యమకారుడిగా, రచయితగా, మార్క్స్, ఫూలే, అంబేద్కరైట్ గా తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చరగని ముద్ర వేసుకున్నాడు. దేశీదిశ – బహుళ బహుజన వాయిస్ – తరపున కుటుంబ సభ్యులకు సానుభూతిని, రామలింగానికి సంతాపాన్ని తెలుపుతున్నాం.