వస్త్ర వ్యాపారంపై కరోనా పంజా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పెండ్లిండ్ల సీజన్‌లో పెద్ద దెబ్బ
– మార్చి నుంచి మే వరకు రూ.8 వేల కోట్ల అమ్మకాలు
– ఈ ఏడాదీ రూ.500 కోట్లే..
– షాపుల అద్దెలు, కరెంటు బిల్లులకే దిక్కులేదు
– ఈఎంఐ,మున్సిపల్‌ పన్నుల వాయిదాకు డిమాండ్‌

రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారంపై కరోనా పంజా విసిరింది. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాల్లేక హౌల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలు వెలవెలబోతున్నాయి. అరకొరగా వచ్చే వినియోగదారుల నుంచి ఎక్కడ కరోనా సోకుతుందేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఎంతటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందోనన్న ఆందోళనతో కొద్ది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్లు ప్రకటించి, వారం తర్వాత మళ్లీ దుకాణాలను తెరుస్తున్నారు. ఇలా.. కరోనా దెబ్బతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తాము నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపుల్లో తమ బతుకు దినదిన గండం.. నూరేండ్ల ఆయుష్షులా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బి.వి.యన్‌.పద్మరాజు
ప్రతీయేటా మార్చి నుంచి మే వరకు రాష్ట్రంలో పెండ్లిండ్ల సీజన్‌ కొనసాగుతుంది. ఈ కాలంలో వస్త్ర దుకాణాలు అమ్మకాలతో కళకళలాడుతుం టాయి. సంవత్సరంలోని 9 నెలల్లో 50 శాతం అమ్మకాలు కొనసాగటం ఒక ఎత్తయితే… కేవలం మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే మిగతా 50 శాతం అమ్మకాలు జరగడం మరో ఎత్తు. దీన్నిబట్టే ఆ మూణ్నెల్ల కాలం ఆ రంగానికి ఎంత విలువైందో అర్థమవుతున్నది. కానీ కరోనా దెబ్బతో ఈ యేడాది పెండిండ్ల సీజన్‌ కళ తప్పింది. కరోనా వ్యాప్తి, దశలవారీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివాహాలు ఆగిపోయాయి. ఒకవేళ జరిగినా పరిమితంగానే. దీంతో హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌, బేగం బజార్‌, సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం హౌల్‌సేల్‌, రిటైల్‌ వస్త్ర దుకాణాలను మూసేశారు. ఫలితంగా తెలంగాణలోని మొత్తం 30 వేల (చిన్నవి, మధ్య తరహావి, పెద్దవన్నీ కలిపి) షాపుల యాజమాన్యాలపై తీవ్ర ప్రభావం పడింది. దిక్కుతోచనిస్థితిలో మళ్లీ షాపులు తెరిచినా..వ్యాపారాలు మాత్రం పుంజుకోవటంలేదు. దీంతో ప్రతి ఏటా పెండిండ్ల సీజన్‌లో రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల దాకా కొనసాగే క్రయ విక్రయాలు.. ఈసారి భారీగా పడిపోయాయి.

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి రూ.500 కోట్ల వ్యాపారం కూడా జరగలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. దీన్నిబట్టి ఆ రంగం ఎంతగా కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. పెండిండ్ల సీజన్‌ కోసమని తీసుకొచ్చి నిల్వ ఉంచిన (స్టాక్‌) వస్త్రాలు.. రెండున్నర నెలలపాటు షాపులు తీయకపోవటంతో కొంత దెబ్బతిన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి వాపోయారు. జిల్లా కేంద్రాలు, మున్సిపల్‌ పట్టణాల్లోని దుకాణాల్లో ఎలుకలు, పంది కొక్కులు చేరటంతో చాలా నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. ఇలా కరోనా వల్ల ఒకవైపు అమ్మకాల్లేకపోవటం, మరోవైపు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, గుమస్తాలు, సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి రావటంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఏడాది వరకూ ప్రభావం…
రాష్ట్రంలో వస్త్ర వ్యాపార రంగం మునుపటి మాదిరిగా పుంజుకోవటానికి ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం పడుతుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. వివాహాల సీజన్‌ మొత్తం తుడిచి పెట్టుకుపోవటంతో వ్యాపారులు ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. పెట్టుబడులు, వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రస్తుతం పెండిండ్లు కొద్దో గొప్పో జరుగుతున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే బంధువులు, స్నేహితులను ఆహ్వానించాలనే నిబంధన ఉండటంతో వినియోగదారులు వధూవరుల వరకే వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ తర్వాత షాపులు తెరిచినప్పటికీ తమకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.

కరెంటు బిల్లులను సాధారణంగా వసూలు చేయాలి… : అమ్మనబోలు ప్రకాశ్‌
అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌
‘మామూలు రోజుల్లో వస్త్ర దుకాణదారులు, యాజమాన్యాల నుంచి హెచ్‌టీ (హై టెన్షన్‌) కరెంటు బిల్లులను విద్యుత్‌శాఖ వసూలు చేస్తుంది. ఈ పద్ధతిలో కరెంటును వాడినా, వాడకపోయినా నిర్ణీత చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల మార్చి చివరి వారం నుంచి మే వరకూ వ్యాపారాలు లేనందున మేం తీవ్రంగా నష్టపోయాం. అందువల్ల ఆ మూణ్నెల్ల కాలానికి హెచ్‌టీ పద్ధతిలో కాకుండా.. సాధారణ పద్ధతిన (ఎంత వాడుకుంటే అంత) బిల్లులను వసూలు చేయాలి. మున్సిపల్‌ ట్యాక్సులు, ఇతర పన్నుల నుంచి ఆ మూణ్నెల్లను మినహాయించాలి…’

ఈఎమ్‌ఐలను వాయిదా వేయాలి..:
గండూరి శంకర్‌ అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌
‘ప్రస్తుతం వస్త్ర వ్యాపార రంగం, దాని మీద ఆధారపడి జీవిస్తున్న వారు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. ప్రతీ యేటా పెండిండ్ల సీజన్‌లో మా జిల్లాలో రూ.200 కోట్ల మేర వ్యాపారం జరిగేది. కానీ ఈ యేడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ అమ్మకాలు రూ.50 కోట్లు కూడా దాటలేదు. అందువల్ల సర్కారు.. మమ్మల్ని ఆదుకోవటానికి, ఈ రంగాన్ని నిలబెట్టటానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. మా షాపులు, దుకాణాలు, వాహనాలపై ఉన్న ఈఎమ్‌ఐలను ఆర్నెల్లపాటు వాయిదా వేయాలి. తద్వారా మమ్మల్ని గట్టెక్కించాలి…’

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates