దిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఫడణవీస్ను గవర్నర్ అహ్వానించడంపై మూడు పార్టీలూ అభ్యంతరం తెలిపాయి. తమకు 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్లో వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి.
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తున్న తరుణంలో ఈ రోజు ఉదయం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ శనివారం ఉదయం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మహారాష్ట్ర ప్రజలకు భాజపా ద్రోహం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. ఈ రోజును దేశ రాజకీయ చరిత్రలో ఓ చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ చట్టవిరుద్ధంగా వ్యవహరించారంటూ ఆయన మండిపడ్డారు.
ఊపందుకున్న క్యాంపు రాజకీయం
మరోవైపు, మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఎన్సీపీ నుంచి చీలి అజిత్ పవార్ వైపు ఎమ్మెల్యేలను దిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ పార్టీకి మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్ సహా నలుగురు మినహా మిగతా వారంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేలందరినీ ముంబయిలోని ఓ హోటల్కు తరలించారు.
Courtesy Eenadu..