- ఏడేళ్ల క్రితం సెషన్స్ కోర్టు విధించిన
- శిక్షను ఖరారు చేసిన హైకోర్టు
చేతబడి చేశారన్న మూఢనమ్మకంతో ముగ్గుర్ని చిత్రహింసలకు గురి చేసి, ఒకరి మరణానికి కారణమైన 11 మంది వ్యక్తులకు సెషన్స్ కోర్టు విధించిన జీవితకాల శిక్షను హైకోర్టు సమర్థించింది. వారికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి, వెంటనే వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా సిరోల్ గ్రామానికి చెందిన చింతల జనార్దన్ అనారోగ్యంతో మరణించాడు. పది రోజులకు 2003 ఏప్రిల్ 29న అతని బంధువు చింతల సత్యం మృతిచెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను మహబూబాబాద్ వెళ్లి డాక్టర్ను కలిశాడు. మందులు కొంటుండగా అతనికి గుండెపోటు వచ్చింది. సత్యం మృతదేహాన్ని అతని బంధువులు గ్రామానికి తీసుకొచ్చారు. జనార్దన్, సత్యం మృతికి క్షుద్రపూజలు చేస్తున్న మాదిపెద్ది రాములే కారణమని వారు నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ 30న రాత్రి 11 గంటలకు రాములును కరెంట్ స్తంభానికి కట్టి తీవ్రంగా కొట్టారు. నీతోపాటు ఇంకా ఎవరున్నారంటూ తీవ్రంగా హింసిచారు. కమ్మరికుంట్ల ముత్తయ్య, ఎర్రబాటి గోపయ్య పేర్లను రాములు చెప్పాడు. సత్యం కుటుంబీకులు ఆ ఇద్దర్నీ కూడా తీసుకొచ్చి, కరెంట్ స్తంభానికి కట్టి తీవ్రంగా కొట్టారు. సత్యం మృతదేహానికి తిలకం దిద్ది బతికించాలని డిమాండ్ చేశారు. అక్కడకు వచ్చిన కానిస్టేబుళ్లను అడ్డుకున్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి జనాన్ని వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రికి తరలించారు. గోపయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో 49 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టు ఈ కేసు విచారించి, చింతల నర్సయ్యతో పాటు మరో 10 మందిని దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2012 ఆగస్టు 30న తీర్పు వెలువరించింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా గత ఏడాది జనవరి 22న నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఆపై అప్పీలు పిటిషన్ను పూర్తిగా విచారించిన హైకోర్టు.. సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది.
Courtesy Andhrajyothi…