బెంగళూరు: లాక్డౌన్ నేపథ్యంలో తమ ఆకలి కేకలను నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి వినిపించేందుకు కర్ణాటక ట్యాక్సీ డ్రైవర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖాళీ గిన్నెలు, కంచాలను మోగిస్తూ తమ దైన్యాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి తినడానికి తిండలేక కష్టాలు పడుతున్నారు.
తమ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్ డ్రైవర్ల సంఘం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తమపై పాలకుల చూపుతున్న పక్షపాతానికి నిరసనగా డ్రైవర్లు అందరూ ఇళ్లలో కూర్చుని ఖాళీ కంచాలు, పళ్లాలు మోగించాలని కోరింది. దీనికి స్పందించి వందలాది మంది డ్రైవర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘నెలన్నర రోజులుగా లాక్డౌన్ జరుగుతుండటంతో ఉపాధి లేక డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు పస్తులు ఉంటున్నారు. మమ్మల్ని ఆదుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. డైవర్లపై ప్రభుత్వం చూపుతున్న పక్షపాతానికి నిరసనగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఇందులో భాగంగా డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి ఖాళీ గిన్నెలు, కంచాలు మోగించారు. వీటిని వీడియోలు, ఫొటోలు తీసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయాలని కోరామ’ని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు తన్వీర్ పాషా తెలిపారు.