అర్నబ్ గోస్వామిపై కేసు
ముంబయి : ఒక మతానికి చెందినవారి వల్లే కరోనా వైరస్ విస్తరిస్తున్నదనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని ‘రిపబ్లిక్ టీవీ’ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై ముంబయిలోని బాంద్రా పోలీసులు కేసు నమోదుచేశారు. ముస్లిం మతానికి చెందినవారిని లక్ష్యంగా చేసుకొని ఇటీవల (ఏప్రిల్ 29న) ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికుల నిరసనకు, సమీపంలోని మసీద్కు ముడిపెట్టి ఆర్నాబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు, టీవీ చర్చ జరిపిన తీరు సర్వత్రా విమర్శలపాలైంది. సంబంధంలేని విషయాలకు ముడిపెడుతూ, ఒక మతానికి చెందినవారిపై విద్వేషాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆయనపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. దానిపై ప్రాథమిక విచారణ చేసిన బాంద్రా పోలీసులు గోస్వామిపై కేసు నమోదుచేశారు.
దీనిపై సంబంధిత పోలీస్ అధికారి మాట్లాడుతూ, ”బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన (ఏప్రిల్ 29న) కార్యక్రమానికి ఆర్నాబ్ గోస్వామి యాంకరింగ్ చేశారు. టీవీలో చర్చ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, మత విద్వేషాలకు తావిచ్చేలా మాట్లాడారని ఫిర్యాదు అందింది. దీనిపై వీడియో ఫుటేజ్, పెన్ డ్రైవ్లు సేకరించాం. టీవీలో చర్చ జరిపిన తీరుపై విచారణ జరుపుతున్నా”మని అన్నారు.
Courtesy: NT