రాష్ట్రపతికి 72 మంది ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన మత కలహాలకు బీజేపీ ప్రోత్సహించిందనే వార్తలపైనా, పోలీసుల భాగస్వామ్యంపైనా విచారణ జరిపించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు 72 మంది ప్రముఖులు లేఖ రాసారు. ఇందులో సివిల్ సర్వీసెస్కు చెందిన మాజీ అధికారులు కూడా ఉన్నారు. ‘ఈ మతకలహాలపై ప్రస్తుతం ఢిల్లీ పోలీసులచే ప్రస్తుతం జరుగుతున్న విచారణ ఎలాంటి విశ్వాసం కలిగించడం లేదు. ఈ అల్లర్లలో భాగస్వామ్యం ఉందని అనేకమంది సీనియర్ పోలీస్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
అల్లరి మూకకు సహాయం చేయడం లేదా స్థబత్తుగా నిలబడి ఉండటం, హింసను చూస్తూ ఉండిపోయినట్టు పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ తనంతట తానుగా కవచం ఏర్పాటు చేసుకుందనే భావన ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు. బాధితుల్ని కస్టడీలో హింసకు గురిచేయడం, బీజేపీకి వ్యతిరేకంగా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, అల్లర్లకు అనవసరమైన ఆధారాలతో నిరసనలను నేరపూరితం చేయడం, విచారణ సమయంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను తీవ్రమైన వేధింపులకు గురిచేయడం.. వంటి ఆరోపణలతో పోలీసులపై వార్తలు వస్తున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్టులతో ఒక వర్గం నుంచి వస్తున్న ఆగ్రహాలను దృష్టిలో పెట్టుకొని అరెస్టుల సమయంలో ‘తగిన జాగ్రత్తలు, ముందుస్తు చర్యలు’ తీసుకోవాలని గురువారం ఢిల్లీ మైనార్టీస్ కమిషన్ (డీఎంసీ) విడుదల చేసిన నివేదికను, అదేవిధంగా ఈ నెల 8న పోలీసు ప్రత్యేక కమిషన్ ప్రవీర్ రంజన్ జారీ చేసిన ఉత్తర్వును లేఖలో ప్రస్తావించారు.
‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చాలా కీలకం. దేశంలో ప్రస్తుతం రేగుతున్న అసమ్మతి, నిరసనలలను చల్లబరిచే విధంగా దర్యాప్తును కొనసాగించడాన్ని అనుమతించం. అందువలన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం ఉన్నత న్యాయవ్యవస్థకు చెందిన సిట్టింగ్, రిటైర్డ్ జడ్జి చేత ఈ కేసును విచారణ జరిపించాలని భారత ప్రభుత్వాన్ని మేం కోరుతున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. ‘అలాగే, అల్లర్లలో భాగస్వామ్యం ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు ఢిల్లీ పోలీసులు చేత నిర్వహించబడుతున్న విచారణలో పాలుపంచుకోకుండా ఉండేలా చూడాలని కోరుతున్నాం’ అని లేఖలో తెలిపారు.
ఈ లేఖరాసిన వారిలో గతంలో కేంద్ర మంత్రిత్వ శాఖలకు కార్యదర్శులుగా పని చేసిన అభిజిత్ గుప్త, అలోక్ పెర్తి, బ్రిజేష్ కుమార్, చంద్రశేఖర్ బాలకృష్ణన్, ఈఎఎస్ శర్మ, జవహర్ సిర్కార్, కె.సుజతారావు, కమల్ జస్వాల్, మీనా గుప్త, ఎన్సి సక్సేనా, నరేంద్ర సిసోడియా, అర్థికవేత్త ప్రభాత్ పట్నాయిక్ తదితరులు ఉన్నారు.
Courtesy: NT