అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్ ..ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
కమలా హారిస్ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్ పార్టీ సెనేటర్గా ఉన్నారు. జో బిడెన్కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. కమలా హారిస్ ఎంపికను జో బిడెన్ ట్విటర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తామిద్దరం కలిసి డొనాల్డ్ ట్రంప్ను ఓడించబోతున్నామన్నారు. అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కమలా హారిస్ తనకు చక్కని భాగస్వామి అని అభివర్ణించారు. తన ఎంపికపై స్పందించిన కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. కమలా హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.
Courtesy Eenadu