- విజయవాడ కొవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ కొవిడ్ ఆస్పత్రిలో మంటలంటుకుని 8 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో అగ్నిమాపక నిబంధనలను పాటించాలని, వాటిని ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తప్పవని పేర్కొంటూ.. ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ చికిత్సకు 150కి పైగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వగా.. వాటిలో 100 వరకు మాత్రమే కరోనా రోగులకు వైద్యాన్ని అందజేస్తున్నాయి. హైదరాబాద్లో ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఫుల్ అవ్వడంతో.. యాజమాన్యాలు 36 హోటళ్లు, అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని, వాటిని కొవిడ్ కేర్ సెంటర్స్గా మార్చాయి. అక్కడ లక్షణాలు తక్కువగా ఉన్న రోగులకు వైద్యం అందజేస్తున్నాయి. రాష్ట్రంలో రోజూ 2 వేల వరకు పాజిటివ్కేసులు వస్తుండగా.. వాటిలో 80ు లక్షణాలు లేనివారే ఉంటున్నారు. లక్షణాలున్న వారితోపాటు.. కొందరు పాజిటివ్ అనగానే భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఇలాంటి వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నాయి.
ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఎంత?
గత ఏడాది అక్టోబరు 21న ఎల్బీనగర్లోని షైన్ చిల్ర్డెన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విచారణలో ఆ ఆస్పత్రికి ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్ లేదని తేలింది. అలాగే జంట నగరాల పరిధిలోని చాలా ఆస్పత్రులకు ఫైర్ ఎన్వోసీ లేదని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. కొన్ని ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీ చేసింది. తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్టు-1999 ప్రకారం పైర్సేప్టీ ఎన్వోసీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రకారం చాలా ఆస్పత్రుల్లో ఫైర్ సేప్టీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే గత ఏడాది జనవరిలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో చాలా ఆస్పత్రుల్లో అగ్నిమాపక నిబంధనలు అమలవ్వడం లేదని స్పష్టం చేశాయి. అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. కొన్ని ఆస్పత్రులు ఫైర్ ఎన్వోసీని రెన్యువల్ చేయించుకోలేదని ఆ నివేదికలో వివరించాయి.
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు: గడల
కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో కచ్చితంగా అగ్నిమాపక నిబంధనలను పాటించాలంటూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అందులో పేర్కొన్నారు.
Courtesy Andhrajyothi