- హోం క్వారంటైన్పై రాష్ట్ర సర్కారు నిర్ణయం
- ప్రైమరీ కాంటాక్టులకు సర్కారీ కేంద్రాల్లో!
- వారికి మాత్రమే పరీక్షలు
- లక్షణాలు లేని సెకండరీ కాంటాక్టులకు టెస్టుల్లేవ్
- వారికి హోం క్వారంటైన్ ముద్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్-19 ఇంక్యుబేషన్ పీరియడ్ (వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి పట్టే సమయం) 1 నుంచి 14 రోజులని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా.. కొందరిలో 14-28 రోజుల మధ్య కూడా బయటపడుతుండడంతో హోం క్వారంటైన్ పీరియడ్ను 28 రోజులకు పెంచింది. అలాగే.. కరోనా పాజిటివ్ వచ్చినవారిని కలిసిన ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే ఇకపై వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.
అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తీసుకువచ్చి అక్కడ నమూనాలను సేకరిస్తారు. ప్రైమరీ కాంటాక్టులతో సన్నిహితంగా మెలిగినవారికి (సెకండరీ కాంటాక్టులకు) కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తారు. లక్షణాలు లేకపోతే టెస్టులు చేయరు. వారికి క్వారంటైన్ ముద్ర వేసి ఇంట్లోనే 28 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా (హోం క్వారంటైన్) ఆదేశిస్తారు. వారు 28 రోజులపాటు ఇంట్లోనే ఉంటున్నారా లేదా అనే విషయాన్ని నిత్యం పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఈలోగా లక్షణాలు బయటపడితే వారిని సర్కారీ క్వారంటైన్ కేంద్రాలకు తీసుకువెళ్లి పరీక్షలు చేయిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Courtesy Andhrajyothi