– పరీక్షలు, చికిత్సకు రూ. 12 లక్షలు మంజూరు
– పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్
– పరీక్షలకు సహకరించిన ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వివిధ తెలుగు ఛానల్స్, మీడియా సంస్థల్లో పని చేస్తోన్న జర్నలిస్ట్లకు కరోనా వైరస్ సోకడంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. కరోనా టెస్ట్ల నిర్వహణ, బాధితులకు సహాయం చేసేందుకు ఇరు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. తాజాగా ఢిల్లీలో ముగ్గురు తెలుగు జర్నలిస్ట్లకు కరోనా సోకిందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర సమాచార శాఖ (ఐఅండ్పీఆర్) కమిషనర్ అరవింద్ కుమార్కు తగిన సూచనలు చేశారు. వైరస్ బారిన పడ్డ జర్నలిస్ట్ల ఆరోగ్య పరిస్థితి, వైద్యం అందుతోన్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు జర్నలిస్ట్లకు కోవిడ్ 19 పరీక్షల నిర్వహణతో పాటూ, వైద్య సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 12 లక్షలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. వైరస్ సోకిన ముగ్గురు జర్నలిస్టులకు తక్షణ ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి రూ. 75 వేల నగదు విడుదల చేసింది. ఈ దిశలో ఐఅండ్ పీఆర్ శాఖతో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని మీడియా ప్రతినిధులకు ధైర్యం చెప్పారు. కరోనా టెస్ట్ ల నిర్వహణ, ఆరోగ్య విషయాల్లో ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దష్టికి తీసుకురావాలని కోరారు. జర్నలిస్ట్ లకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తెలుగు జర్నలిస్ట్లకు ప్రత్యేక క్యాంప్…
ఢిల్లీలో పని చేసే తెలుగు జర్నలిస్ట్ ల ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థల్లో పని చేస్తోన్న వారందరికీ కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బుధవారం జర్నలిస్ట్లకు ఉచిత పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభరు త్రిపాఠి తెలిపారు. ఇందుకు కోసం అపోలో ఆసుపత్రి వర్గాలతో చర్చించినట్టు వెల్లడించారు.
Courtesy: NT