– సెప్టెంబరు త్రైమాసికానికీ జీడీపీ వృద్ధి4.5 శాతమే..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్రంలోని మోడీ నిర్మాణాత్మక చర్యలు లేకపోవడంతో దేశ వృద్ధి రేటు మరోసారి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు గాను మోడీ సర్కారు దిశదశ లేని పలు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తుండడంతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంతకంతకుపడిపోతూ వస్తోంది. ప్రభుత్వం తాజాగా శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.5 శాతం తక్కువ.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. గత ఆరేండ్లలో జీడీపీ ఇంత కనిష్టస్థాయిలో వృద్ధిరేటు నమోదు కావడం ఇదే తొలిసారి. 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3గా నమోదైన జీడీపీ ఆ తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొట్టమొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయివేటు పెట్టుబడులు బలహీనపడడం, వినిమయ డిమాండ్లో మందగమన పరిస్థితులకు తోడు కేంద్రంలోని మోడీ సర్కారు సరైన నిర్మాణాత్మక చర్యలు తీసుకోని కారణంగా వృద్ధి దారుణంగా పడిపోయినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, 2018-19లో 7 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి వేగంగా క్షీణస్తూ రావడం విశేషం.
గతేడాది ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో 7.5 శాతంగా ఉన్న జీడీపీ ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలానికి 4.8 శాతానికి పడిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయ రిజర్వు బ్యాంకు దేశ ఆర్థిక వ్యవస్థ 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తొలత అంచనా కట్టింది. అయితే దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దాన్ని బ్యాంక్ 6.1 శాతానికి సవరించిన విషయం తెలిసిందే. కార్ల నుంచి బిస్కెట్ల వరకు అమ్మకాల్లో తగ్గుదల, వివిధ రంగాల్లో ఉద్యోగులకు ఉద్వాసన, వినియోగదారుల కొనుగోళ్లలో తగ్గుదలతో పాటు ప్రయివేటు పెట్టుబడుల క్షీణత వల్ల జీడీపీ దిగజారినట్టు ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ఆర్థిక మందగమనం నివారణకు తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇవి మంచి ఫలితాలన ఇస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించిన రెండు రోజులకే వృద్ధిరేటు దారుణంగా పడిపోయిందంటూ సర్కారు నుంచి వృద్ధి గణాంకాలు వెలువడడం విశేషం. తాజా గణాంకాల నేపథ్యంలో సర్కారు స్పందన ఎలా ఉండనుందో వేచి చూడాలి..
Courtesy NavaTelangana…