అధికార గణాంకాలు వెల్లడి
న్యూఢిల్లీ : పేదలకు ఉచిత పప్పు ధాన్యాలను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కుటుంబానికి కిలో చొప్పున ఉచిత పప్పు ధాన్యాన్ని పేద కుటుంబాలకు అందిస్తామని గత నెలలో ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి దాదాపు నెల రోజులు కావస్తున్నా కేవలం 10 శాతం ఉచిత పప్పు ధాన్యాలు మాత్రమే ఇప్పటి వరకు పేదలకు అందడం గమనార్హం. ఆర్థికంగా పేద వర్గాలలోని లబ్ది దారుల గృహాలకు అవి ఇంకా చేరువ కాలేదు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై) కింద పేద కుటుంబాలకు సరఫరా చేసేందుకు నెలకు 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది.
అయితే విేనియోగదారు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు 19,496 టన్నుల పప్పు ధాన్యాలను మాత్రమే బుధవారం నాటికి రాష్ట్రాలు పంపిణీ చేశాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాను ఈ శాఖ పర్యవేక్షిస్తున్నది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎఫ్ఈడీ (నాఫెడ్) మార్కెట్ల నుంచి పప్పు ధాన్యాలను సేకరించి సరఫరా చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ పురోగతి పై గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తూ వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ”1.09,227 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు కూడా పంపించబడ్డాయి” అని తెలిపింది. అయితే పీఎంజీకేఎవై కింద ఎన్ఎఫ్ఎస్ఎ పరిధిలోని 19.55 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ధాన్యాన్ని సరఫరా చేసేందుకు నెలకు 1,95,531 మెట్రిక్ టన్నులను కేటాయించగా, 1,22,312 మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రాలకు అందాయని ఆహార మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Courtesy: NT