న్యూఢిల్లీ : కరోనా అనుమాతులందరికీ ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మార్చుకుంది. నిరు పేదలకు మాత్రమే కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు ఉచితంగా చేయాలని పేర్కొంది. అయితే ఎవరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించింది. ఇండియన్ మెడికల్ ఆఫ్ రీసెర్చ్ నిర్ణయించిన రుసుముల ప్రకారం ప్రైవేటు ల్యాబొరేటరీలు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయొచ్చని ఆదేశించింది. కోవిడ్ నిర్థార పరీక్షకు ప్రైవేటు ల్యాబ్లు రూ.4500 చొప్పున వసూలు చేస్తున్నాయి.
‘కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రభుత్వం విధానమే బాగుందని మేము గుర్తించాం. అందరికీ ఉచితంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న మా గత నిర్ణయాన్ని మార్చుకుంటున్నాం. ఉచిత పరీక్షలకు ఎవరు అర్హులో గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’నని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన వారికి ఇప్పటికే ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు.
కాగా, ఇతర వెనుబడిన వర్గాల్లో పేదలను గుర్తించి, వారికి కూడా ఉచిత పరీక్షలు నిర్వహించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసంఘటిత కార్మికుల్లో అల్పాదాయ వర్గాల వారు, పత్ర్యక్ష నగదు బదిలీ లబ్ధిదారులకు ఉచిత పరీక్షలను వర్తింపచేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారంలోగా నిర్ణయం తీసుకుని తమకు తెలపాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. కాగా, అందరికీ ఉచితంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని గతవారం సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.