ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 81.70 కోట్లు
కాళేశ్వరం రిజర్వాయర్లలో కోటి చేప పిల్లలు
టెక్నికల్ బిడ్లు తెరిచిన జిల్లా కమిటీలు
2, 3 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్
హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22,450 నీటి వనరుల్లో 81.70 కోట్ల చేప పిల్లలు పోయాలని ఇప్పటికే మత్స్యశాఖ నిర్ణయించగా.. సంబంధిత టెండర్ల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. గత నెల 30న టెండర్ల టెక్నికల్ బిడ్స్ తెరిచారు. రెండు, మూడు రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్స్ కూడా ఓపెన్ చేసి, టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ నెలాఖరుకు టెండర్లు, ఒప్పంద ప్రక్రియ పూర్తిచేసి, ఆగస్టు 1 నుంచి నీటి వనరుల వారీగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా 22,450 నీటి వనరులను గుర్తించింది. జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు వెళ్లి తనిఖీలు పూర్తి చేశాయి. నిరుడు 80 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా, 64 కోట్ల పిల్లల్నే పంపిణీ చేశారు.
రూ.44 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా 81.70 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే రూ.50-55 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. చెరువులు, కుంటలతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథఽకం పరిధిలోని రిజర్వాయర్లలో కూడా చేప పిల్లలు పోసేలా మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం రిజర్వాయర్లలో 97 లక్షల పిల్లలను పోయనున్నారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్, సిరిసిల్లలోని అనంతగిరితోపాటు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, సింగూరు, ఎల్లంపల్లి, ఎల్ఎండీ లాంటి 75 రిజర్వాయర్లలో చేప పిల్లలను పోయనున్నారు.
Couretsy AndhraJyothy