నిధుల్లో కోత.. గ్రాంట్లు పెంపు
- 15వ ఆర్థిక సంఘం సిఫారసులు?
- 14వ కమిషన్కు పూర్తి భిన్నం
- నిధులు తగ్గితే రాష్ట్ర పథకాలకు దెబ్బే
- గ్రాంట్లు పెరిగినా షరతులు తప్పవు
- పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు
- అంచనా వేసే అధికారం కేంద్రానిదే!
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి షాక్నిస్తూ పదిహేనో ఆర్థిక సంఘం తన నివేదికను సిద్ధం చేసింది. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించింది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రత్యక్ష కేటాయింపులు తగ్గించి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు అందించే గ్రాంట్లను పెంచుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఎన్కే సింగ్ నేతృత్వం వహించిన ఆర్థిక సంఘం తన నివేదికను గత ఏడాది డిసెంబరులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందించిన సంగతి తెలిసిందే. పథకాలకు నిధులను తగ్గించి రెవెన్యూ లోటు, విపత్తు నిధి, మునిసిపల్, పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లను పెంచిందని అధికార వర్గాలు చెప్పాయి. అలాగే, రాష్ట్రాల పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని సిఫారసు చేసినట్లు తెలిసింది.
గ్రామీణ, సామాజిక రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సిఫారసులు 14వ ఆర్థిక సంఘానికి భిన్నంగా ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఉన్న 32 శాతం నిధుల కేటాయింపును 14వ ఆర్థిక సంఘం 42 శాతానికి పెంచి గ్రాంట్లను తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం తద్భిన్నంగా- నిధులు తగ్గించి గ్రాంట్లను పెంచుతోంది.
నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బే. నిధుల లేమితో వాటిని కుదించడమో లేక ఆపేయడమో చేయాలి. గ్రాంట్ల పెంపు అనేది షరతులకు లోబడి ఉంటుందనీ, రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సి ఉంటుందనీ, ఈ దృష్ట్యా కూడా తమకు భారమేనని రాష్ట్రాల అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఖజానాపై భారం తగ్గుతున్నప్పటికీ రాష్ట్రాలకు భారం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సైతం ఆశించిన రీతిలో చేపట్టలేకపోవచ్చని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొనవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సిఫారసు సరిగా అమలు జరగకపోవచ్చని, ఈ పెర్ఫార్మెన్స్ అసె్సమెంట్ అనేది కేంద్రం చేతిలోనే ఉంటుంది కాబట్టి సరిగా న్యాయం జరగదని రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు రావొ చ్చు.
కానీ ఈ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఓ అధికారి తెలిపారు. 2020-21 వార్షిక బడ్జెట్కు ఇంకా పదిరోజుల గడువుందనగా ప్రస్తుతం ద్రవ్యలోటు జీడీపీలో 3.6 శాతం ఉంది. అంచనా 3.3 శాతం కంటే ఇది ఎక్కువ. ఇక రెవెన్యూ కూడా భారీగా పడిపోయింది. ఫలితంగా ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం 114 శాతానికి పెరిగిపోయింది. ఈ దశలో రాష్ట్రాలకు ఉదారంగా నిధులిచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.
బడ్జెట్ సమావేశాల్లో నివేదిక : 15వ ఆర్థిక సంఘం తన నివేదికను ఇప్పటికే రాష్ట్రపతికి అందించిన నేపథ్యంలో ఈ నెల 31 నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నివేదికను పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ నివేదికతో పాటు ఆర్థిక సంఘం సిఫారసులను ఎన్ని ఆమోదించారు.. ఎన్ని ఆమోదించలేదన్నది వివరిస్తూ యాక్షన్ టేకెన్ నివేదికను కూడా ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు అందిస్తారు.
ప్రతిఘటన తప్పదా..?
15వ ఆర్థిక సంఘ సిఫారసులు నిజంగా ఈ లైన్లోనే ఉంటే రాష్ట్రాల నుంచి ప్రతిఘటన తప్పదని పలువురు ఆర్థిక, రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యం గా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల తగ్గింపును ప్రతిపక్షాలు వ్యతిరేకించవచ్చునని వారంటున్నారు. జీఎస్టీ కింద రావాల్సిన మొత్తాన్నే కేంద్రం నెలల తరబడి ఇవ్వడం లేదు, ఇక పన్నుల వాటా కింద నిధుల్లో కోత పెట్టడమే కాక ఆ కోత పెట్టిన మొత్తాన్ని కూడా సకాలంలో ఇస్తుందన్న నమ్మకం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.