- కొవిడ్-19తో భద్రాచలంలో తుదిశ్వాస
- కొంతకాలంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స
- విజయవాడ తరలిస్తుండగా మృతి
- సున్నంవారిగూడెంలో.. ఆదివాసీ సంప్రదాయంలో అంత్యక్రియలు
భద్రాచలం : ఆదివాసీ ఉద్యమ నేత, సీపీఎం ద్వారా ఎన్నో ప్రజా పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏజెన్సీ యోధుడు, నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో కోయభాషలో గళం వినిపించిన నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం రాజయ్య కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి కొవిడ్-19 సోకింది. ఆ సమయంలో రాజయ్య కూడా జ్వరాన పడ్డారు. అప్పట్లో కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. కానీ.. జ్వరం తగ్గకపోవడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. రాజయ్యకు డెంగీ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు.. ఆ మేరకు చికిత్స అందించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మరోమారు కరో నా పరిక్షలు నిర్వహించగా.. కొవిడ్-19 నిర్ధారణ అయ్యింది. దీంతో.. మంగళవారం ఉదయం ఆయనను విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రాజయ్య మృతదేహానికి మంగళవారం సున్నంవారి గూడెంలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
నిరాడంబరుడు
ప్రస్తుత ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెం గ్రామం (అప్పట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం)లో 1958 ఆగస్టు 8న సున్నం రాజులు-కన్నమ్మ దంపతులకు రాజయ్య జన్మించారు. పదో తరగతి వరకు చదివిన రాజయ్యకు చుక్కమ్మతో వివాహం జరిగింది. ఆయనకు ము గ్గురు సంతానం. 1979లో సీపీఎంలో చేరిన రాజ య్య.. 1988లో వరరామచంద్రాపురం మండలం చిన్నమట్టపల్లి సర్పంచ్గా విజయం సాధిచారు. మూడుసార్లు (1999, 2004, 2014) భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం నుంచి, 2019లో ఏపీలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. రాజయ్య ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో బస్సులు, ఆటోల్లోనే సామాన్యుడిలా.. ప్రయాణించేవారు. నిరాడంబరంగా ఉండేవారు. సామాన్యులతో కలిసిపోయే తత్వం ఆయన్ను ప్రజల మనిషిని చేసింది. అధికారులతో కూడా సన్నిహితంగా వ్యవహరిస్తూ.. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రాజెక్టులు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారులు తదితర సమస్యలపై పలుమార్లు అసెంబ్లీ వేదికగా తన వాణిని వినిపించారు. కోయభాషలో మాట్లాడి భద్రాచలం నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు.
ఏజెన్సీ పోరాట యోధుడు
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సున్నం రాజయ్య.. సీపీఎం ద్వారా ఎన్నో ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తునికాకు ధరలు, భూ పోరాటాలు, పోలవరం నిర్వాసితుల తరపున మహాపాదయాత్ర, తమ్మినేని సైకిల్ యాత్ర, రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పరిధిలోకి వెళ్లిన ఏడు ముంపు మండలాలను తిరిగి భద్రాచలంలో విలీనం చే యాలనే డిమాండ్తో భద్రాచలంలో నిరశన దీక్ష చేపట్టారు. జిల్లాల పునిర్వభజన సమయంలోనూ భద్రాచలం నియోజకవర్గానికి అన్యాయం చేయొద్దంటూ నిరవధిక నిరశన దీక్షకు దిగారు.
Courtesy Andhrajyothi