సామాన్యులు ఉక్కిరిబిక్కిరి…
ఆకాశాన్నంటుతున్న ధరలు
కుటుంబాలపై 20 నుంచి 30 శాతం పెరిగిన భారం
ఎగబాకుతున్న నిత్యావసర సరకుల ధరలు
కొండెక్కి కూర్చున్న కూరగాయలు
రాష్ట్రంలో నవంబరు ద్రవ్యోల్బణం రేటు 5.94 శాతం
ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి జీవులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ధరల పెరుగుదల సామాన్యులకు శరాఘాతంగా మారింది. మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు.. ధరల పెరుగుదలకు పరాకాష్ఠగా నిలిచింది. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప సంచులు నిండటంలేదనే ఆవేదన ప్రజల్లో పెరుగుతోంది. నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు దూసుకెళ్తున్న నేపథ్యంలో నెలకు 20 నుంచి 30 శాతం దాకా వ్యయం పెరుగుతోంది. వినియోగదారు ధరల సూచి ఆధారంగా నవంబరులో ద్రవ్యోల్బణం రేటు జాతీయ సగటు కంటే తెలంగాణలో అధికంగా ఉంది. దేశంలో నవంబరులో గత మూడేళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో అదే నెలలో ద్రవ్యోల్బణం 5.94 శాతానికి ఎగసింది. ఆహారోత్పత్తులు, నిత్యావసరాలు కొనాలంటే ప్రజల ఖర్చు ఏకంగా 20 నుంచి 30 శాతం పెరిగినట్లు ధరల లెక్కలే వివరిస్తున్నాయి. ఆహారోత్పత్తుల ధరలను జిల్లాల నుంచి సేకరించి రాష్ట్ర సగటు ధరను పౌరసరఫరాల శాఖ రోజువారీగా ప్రకటిస్తుంది. ఈ నివేదికలో చూపే వాటి కన్నా చిల్లర మార్కెట్లలో ధరలు అధికంగా ఉంటున్నాయి. పలు ఆహారోత్పత్తుల ధరలు ఏడాది వ్యవధిలో 10 నుంచి 30 శాతం వరకూ పెరిగాయని చిల్లర వ్యాపారులే చెపుతున్నారు. పౌరసరఫరాల శాఖ నివేదిక ప్రకారం అత్యధికంగా ఉల్లిగడ్డలు సుమారు 300 శాతం.. పప్పుల్లో మినప్పప్పు ధర 34 శాతం పెరిగాయి.
దిగిరాని కూరగాయల ధరలు
సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు తక్కువగా ఉండాలి. తాజా పరిస్థితి తద్భిన్నం.వీటి ధరల్లో అత్యధికం ప్రజలను బెదరగొట్టే స్థాయిలో పెరిగాయి. మునగకాయలు, ఉల్లిగడ్డలు కొనాలంటే గుండెలు అదురుతున్నాయి. మునగకాయ ఒక్కోటి రూ.20కి అమ్ముతున్నారు. వివిధ రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి కూరగాయలు వస్తున్నందున రవాణా ఛార్జీలతో కలిపి ధరలు మండుతున్నట్లు మార్కెటింగ్శాఖ అధికారులు చెప్పారు.
నెల గడవడం కష్టంగా ఉంది
మా ఇంట్లో నలుగురం ఉంటాం. మావారితో పాటు నేనూ ఉద్యోగం చేస్తున్నా. నానాటికీ పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఉల్లి కేజీ రూ.120 కావడంతో వాడకం పూర్తిగా మానేశాం. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రూ.500 తీసుకెళ్లినా సరిపోవడం లేదు. కూరగాయలకే నెలకు భారీగా వెచ్చించాల్సి వస్తోంది. నూనెలు, నిత్యావసరాల ధరలు, మొబైల్ ఛార్జీలు ఇలా ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి.
–లలిత, హన్మకొండ
ఉల్లి కొనడం తగ్గించేశాం
ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. వారానికి సరిపడా నిత్యావసర సరకుల ధరలు కొనే సొమ్ముతో కిలో ఉల్లిగడ్డలు రావడం లేదు. అందుకే వాటిని కొనటం, వాడటం బాగా తగ్గించాం. కూరగాయలే కొనలేకపోతున్నాం. మాలాంటి సామాన్య కుటుంబాలకు వచ్చేదే ఆరకొర ఆదాయం. దాంతోనే సరకులన్నీ కొనే పరిస్థితి లేదిప్పుడు.
–శ్రావణి, నందిపేట, నిజామాబాద్ జిల్లా
(Courtesy Eenadu)