- మద్దతిస్తే చాలదు.. సమస్యలూ పరిష్కరించాలి..
- కార్మికులూ ఆత్మహత్యలొద్దు: ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు అధైర్య పడవద్దని, ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఙప్తి చేసింది. సమ్మెలో పాల్గొంటూ అసువులు బాసిన శ్రీనివా్సరెడ్డి, సురేంద ర్గౌడ్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము వ్యతిరేకం కాదని జేఏసీ ఛైర్మన్ కె.రవీందర్రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మె ద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటున్న వారిలో ముందు వరుసలో తామున్నామని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులతో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాట్లాడి, సమస్యల పరిష్కారానికి పూనుకుంటుందని తెలిపారు. ఈ సమ్మెతో పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని ఆశిస్తున్న కొంత మంది నాయకులు తమమీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మెకు మద్దతు ఇవ్వడంతో బాధ్యత తీరదని, సమస్య పరిష్కారం కోసం కృషి చేయడమే నిజమైన మద్దతని చెప్పారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. వాటితో పాటే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా చర్చిస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదని చెప్పారు. టీఎన్జీవో, టీజీవో నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే వాటిని మానుకోవాలని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనను ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల సర్వీసు అటు ఆర్టీసీకి, ఇటు మీ కుటుంబాలకు ఎంతో అవసరమని అన్నారు.
టీఎన్జీవోల కార్యవర్గ భేటీ నేడు
సకల జనుల నుంచి ముప్పేట దాడికి గురవుతున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరుగనుంది. ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారు. ఐదు రోజులుగా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడి అంతా ఇంతాకాదు. ఆర్టీసీ సమ్మె తీవ్రంగా నడుస్తున్న సమయంలో సీఎం కేసీఆర్తో భేటీ కావడం, క లిసి భోజనం చేయడం, సీఎం అభినందించారంటూ ప్రకటనలు చేయడంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సమావేశంప్రాధాన్యం సంతరించుకుంది. 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
చెప్పలేదనడం సరికాదు: అశ్వత్థామ
సమ్మె విషయం తమకు చెప్పలేదంటూ టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అనడం సరి కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆయనకు చెప్పిన తర్వాతే సమ్మె తేదీని ప్రకటించామన్నారు. కావాలంటే తన కాల్ లిస్టును, రవీందర్రెడ్డి కాల్ లిస్టును పరిశీలించాలని సూచించారు. సమ్మె నోటీసు ఇచ్చిన నాటి నుంచి టీఎన్జీవో, టీజీవో నాయకులు రవీందర్రెడ్డి, దేవీప్రసాద్, మమతలకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేశామన్నారు. ఇటీవల సీఎంను కలిసిన అనంతరం ఆ నేతలు తమకు ఆర్టీసీ జేఏసీ ఏమీ చెప్పలేదనడం సరి కాదన్నారు. సమ్మె విషయం చెప్పలేదనడం చావుకు పిలవలేదనడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం ఆర్టీసీ కార్మికుల వైపు ఉందని, ప్రతిపక్ష పార్టీలు, కుల, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా టీఎన్జీవో, టీజీఓ నేతలు కూడామద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
Courtesy Andhra Jyothy