కులాల గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– డాక్టర్‌ దేవరాజు మహారాజువ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌.

భారతదేశ మూలవాసులెవరు? ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారెవరు? తేల్చుకోవడానికి – కాలక్రమంలో ఇక్కడ కులాలు ఎలా పుట్టాయన్నదానికీ – ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన జన్యుపరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మైఖేల్‌ బమ్‌శద్‌, తూమస్‌ కిమిసిలిడ్‌, లిన్‌.బి.జుర్డేలు.. వారు జరిపిన పరిశోధనల సారాంశాన్ని క్రోడీకరించి ప్రకటించారు. భారత ఉపఖండంలో జీవిస్తున్న ఒక బిలియన్‌ ప్రజల మూలాల గూర్చి తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు జరిగాయి. ఇండో యూరోపియన్‌ భాష మాట్లాడేవారు కొందరు ఉత్తరాన పశ్చిమ దిశ నుంచి అంటే యురేషియా (యూరోప్‌+ఆసియా) నుంచి వలసలు వచ్చి ద్రావిడ భాషలు మాట్లాడే దక్షిణ భారతీయులతో కలిసి, క్రమంగా హిందూ కులవ్యవస్థకు పునాదులు వేశారని, అక్కడి మూలవాసుల్ని అణగదొక్కి దేవుళ్ళ పరుతో ధర్మ ప్రబోధాలు చేస్తూ, వారిపై ఆధిపత్యం సాగించారని తేలింది. మూడు నుంచి ఎనిమిది వేల మధ్య కాలంలో ఆనటోలియా, కాకేసస్‌ వంటి ప్రాంతాల నుంచి యురేషియన్లు వచ్చి – ప్రాంతీయ స్థితిగతులపై అవగాహన పెంచుకుని, భూములు ఆక్రమించుకుని, మూలవాసుల్ని బానిసలుగా మార్చి, హిందూ కులవ్యవస్థను ప్రతిష్టాపించి – అధికారం చేజిక్కించుకున్నారని ధృవపడింది. భారతీయులకు యూరోపియనులతో, ఆసియా వాసులతో గల సంబంధాలు బయటపడటానికి జన్యు పరిశోధనలే శరణ్యమయ్యాయి.

ఎంటీ డీఎన్‌ఏ లేక వై క్రోమోజోమ్‌ పాలిమార్ఫిజంల వల్ల ఈ దేశజనాభాలో ఆర్యుల మూలాలున్నవారు ఆసియా నుంచి లేదా యూరోప్‌ నుంచి వలస వచ్చినవారేనన్నది నిర్ధారణ అయ్యింది. యురేషియన్లు అంటే ఆర్యులు, ఈ దేశంలోకి వలసలు రావడానికైనా, స్థిరపడటానికైనా నియోలిథిక్‌ యుగం చాలా కీలకమైంది. అలాగే ప్లిస్టోసీన్‌ యుగంలో జరిగిన వలసలు కూడా ముఖ్యమైనవే. బహుశా అప్పుడే ఆఫ్రికా నుంచి పశ్చిమాసియాకు, అక్కణ్ణించి దక్షిణ భారతదేశానికి వలసలు జరిగాయి. యూనివర్సిటీ ఆఫ్‌ ఉట్టా (యుటిఏహెచ్‌) అమెరికా, ఆంధ్రాయూనివర్సిటీ, భారత ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు జరిగాయి. ఇంటిపేర్లు, పుట్టిన స్థలాలు, వారి వారి కులాలు, వర్ణాలు అన్నీ నమోదు చేయబడ్డాయి. వాటితో పాటు 8మి.లీ. రక్తం, ఐదు తల వెంట్రుకలు కూడా డీఎన్‌ఏ పరీక్షల కోసం సేకరించడం జరిగింది. వృత్తులు, ఆర్థిక సామాజిక స్థితిగతుల వివరాలు కూడా సేకరించడం జరిగింది.

ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – మొదటి మూడు స్థానాల్లో, స్థాయిలలో ఉన్న వీరు, రెండుసార్లు జన్మమెత్తిన వారిగా భావిస్తారు. కాపులు, యాదవులు, ఒకసారి జన్మనెత్తినవారిగా భావిస్తారు. వీరు నాలుగోస్థానంలోని వారు. చివరికి పంచములు (ఐదోస్థానం)లో ఉన్నవారిది చివరిస్థానం. వీరు అంటరానివారిగా పరిగణింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాతృభాషగా గల అన్ని కులాల నుంచి నమోనాలు సేకరించి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిపి క్రిష్ణన్‌-రెడ్డి అనే పరిశోధకులు 1994లో ఫలితాలు ప్రకటించారు.
దీనికి మరింత బలాన్ని చేకూర్చే పరిశోధనలు మన హైదరాబాదు సెంటర్‌ ఫర్‌ సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో జరిగాయి. భారతీయ మూలవాసులు ఎవరన్నది గ్రహించడానికి డాక్టర్‌ తంగరాజ్‌ స్వయంగా అండమాన్‌ నికోబార్‌ తెగలవారి డీఎన్‌ఏ సేకరించి, అధ్యయనం చేసి విశ్లేషించారు. హరియాణాలో రాఖిగర్హి అనే సింధూ నాగరికతకు సంబంధించిన ప్రాంతం ఉంది. అక్కడ దొరికిన 60 అస్థిపంజరాల నుంచి ఒక పూర్తి జన్యు క్రమాన్ని పరిశోధకులు నిర్మించగలిగారు. ఇది అండమాన్‌ నికోబార్‌ తెగల జన్యు క్రమాన్ని పోలి ఉంది. అంటే హరప్పా ప్రజలకు అండమాన్‌ నికోబార్‌లలో ప్రస్తుతమున్న తెగలవారికి (హంటర్‌ గేదరర్స్‌) దగ్గరి సంబంధాలు కనబడ్డాయి.

వీరి పూర్వీకులే ఒకప్పటి హరప్పా వాసులన్న మాట! ఇరాన్‌, టర్కీల నుంచి ఐదువేల ఏండ్ల క్రితం యూరప్‌ వైపు మాత్రమే కాకుండా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు కొందరు వలస వచ్చారనీ తెలిసింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం హరప్పా ప్రాంతంలో నివసించిన ఒక వ్యక్తి జన్యు క్రమాన్ని సీసీయంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ అతని సహచరులు పునర్‌ నిర్మించారు. అలాగే 524 మంది డీఎన్‌ఏను విశ్లేషించారు. కొన్ని వేల ఏండ్ల క్రితం జీవించిన ఇంత మంది వ్యక్తుల డీఎన్‌ఏ విశ్లేషించడం ఇదే ప్రథమం. హరప్పా ప్రాంతంలో 12వేల ఏండ్ల నుంచి 2 వేల ఏండ్ల దాకా అంటే ఇనుపయుగం వరకు జీవించి ఉన్న ప్రజల అవశేషాల నుంచి డీఎన్‌ఏ సేకరించగలిగారు. యురేషియన్లు అంటే సంచారజాతి ఆర్యులు ఇక్కడి మూలవాసులు కాదు.. అని మైఖేల్‌ బమ్‌శద్‌ బృందం చెప్పిన విషయం, ఇక్కడ డాక్టర్‌ తంగరాజ్‌ బృందం చెప్పిన విషయం దాదాపు ఒకటే. నాణానికి ఒక వైపున్న విషయం ఒకరు చెబితే మరొక వైపున్న విషయం మరొకరు చెప్పారు.
దేశంలో అప్పటికే సుసంపన్నంగా ఉన్న సింధూ (హరప్పా) నాగరికతను హింసోన్మాద సంచార జాతి ఆర్యులు ధ్వంసం చేశారు. అది అప్పటికి శాంతి నిలయంగా ఉండేది. చివరికి వారు సప్త సింధు ప్రాంతంలో నివాసాలేర్పరుచుకుని, స్థిరపడి, అనేక రకాల సాహిత్యం సృష్టించారు. దాని ప్రకారం బ్రహ్మ నుదుటి నుంచి పుట్టిన వారు బ్రాహ్మణులని, వారు మాత్రమే పూజలు చేయాలని, క్షత్రియులు రాజ్యాలేలాలని, వైశ్యులు వ్యాపారాలు చేయాలని, శూద్రులు (ప్రస్తుతం బీసీ, యస్సీ, యస్టీలు)పై మూడు వర్గాల వారికి సేవలు చేస్తూ ఉండాలని రాసుకున్నారు.

వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడానికి ‘మనుస్మృతి’ని సృష్టించుకున్నారు. శూద్రుల్ని బ్రాహ్మణులు దోచుకోవచ్చనీ చెప్పారు. దానికి న్యాయబద్ధతను కల్పించుకున్నారు. అందుకే, ఇప్పటికీ బ్రాహ్మణుడు పూజామంత్రాల్లో తప్పనిసరిగా ‘స్వాహా’ అని అంటుంటారు. అంటే ‘నీ సంపద అంతా నాకు రానీరు’ అని కోరుకోవడమన్న మాట! మన ఇంట్లో పూజ చేస్తూనే, మన ఎదుటే మన సంపద అంతా తనకు దక్కాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడన్న మాట! అందుకే ఈ దేశంలో చెప్పులు కుట్టడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం నీచమైన పనులయిపోయాయి. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజల ఆరోగ్యం కాపాడే పనులు హీనంగా చూడబడుతున్నాయి. దేనికీ పనికిరాని మూర్ఖత్వంలో ముంచే పిండాలు పెట్టడం, తద్దినాలకి మంత్రాలు చదవడం చాలా ఉన్నతమైన పనులుగా చలామణీ అవుతున్నాయి. సమాజానికి ఉపయోగపడేవేవో, పడనివేవో ఆలోచించుకునే పనిలేదా?
ఆర్యులు సృష్టించిన ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ చివరికి మూలవాసులైన బహుజనుల్ని అధికారానికి, ఆర్థిక సంపదకు దూరం చేసింది. విజ్ఞానానికీ, సామాజిక హౌదాకు దూరం చేసింది. బ్రాహ్మణీయ-మనువాద వ్యవస్థ బంధాల్ని తెంచుకుని, సమానత్వం కోసమని కొందరు ఇతర మతాల్లోకి మారిన మన మూలవాసుల్ని – బహుజనుల్ని ప్రస్తుతం విదేశీయులుగా ముద్రవేస్తున్నారు. అంటే మన చేయితోనే మన కన్ను పొడుచుకునే ప్రయత్నం మనతోనే చేయిస్తున్నారన్నమాట! భారత రాజ్యాంగంలో మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థను బద్దలు కొట్టి, అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతకగలిగే ఏర్పాటు చేశారు. కానీ, రాజ్యాంగంపై నమ్మకం లేని మనువాదులు ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉండటంతో సామాజిక న్యాయం అందని ద్రాక్షే అయ్యింది. మూలవాసులైన ఈ దేశ బహుజనులు విదేశీయులు కాదు. మధ్య ఆసియా నుంచి దండెత్తి వచ్చిన ఆర్య మనువాద బ్రాహ్మణ వర్గాలే విదేశీయులు! వైజ్ఞానిక పరిశోధనలూ ఈ విషయాన్నే బలపరిచాయి.

సింధూ నాగరికత చిహ్నాలు ఆదివాసుల్లో, గోండులలో ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే గిరిజనులు రావణుడిని, మహిషాసురుణ్ణి, నరకుణ్ణి తమ పూర్వీకులనుకుని, పూజించడం ఉంది. బలిచక్రవర్తి రాజ్యం మళ్ళీ రావాలని కేరళలో ‘ఓనం’ పండుగ చేస్తారు. ఆర్యులు వచ్చేసి ఇక్కడ ఉన్న తెగలను చంపి, దాని చుట్టూ కథలల్లి, ఆ ఆదిమ జాతుల వారసుల్ని శూద్రులుగా పంచములుగా వెలివేశారు. మన పూర్వీకుల చావుల్ని – పండగలని నమ్మించి మన చేతనే వారు అనుకున్న పండగల్ని చేయిస్తున్నారు. నిజం ఏదో తెలుసుకోవాలని అనుకోకపోవడమే విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత గట్టి పడితే అది అంత మూఢ విశ్వాసమవుతుంది. మూఢ విశ్వాసాల్లోంచి బయటపడితేనే నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాయి. ఉదాహరణకు నిత్యజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని చూద్దాం. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఒకసారి కావాలనే మదన్‌మోహన్‌ మాలవ్యాకు చేతితో నీళ్ళు గ్లాసు అందిస్తారు. అతను అందుకుని నీళ్ళు తాగలేదు. ‘ఒక దళితుడి చేతితో నీళ్ళు తాగుతానా?’ అన్న అహంభావం! ఇటీవల సంఘటన మహబూబ్‌నగర్‌జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు జనరల్‌ స్థానం నుంచి ఒక దళితుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అతన్ని అతని సర్పంచ్‌ కార్యాలయంలోనే నేలమీద కూర్చోబెట్టి.. మిగతా ఊరి పెద్దలు కుర్చీలలో కూర్చున్నారు. సభ్య సమాజానికి ఇది సిగ్గుచేటు కదా? ఆంధ్రప్రదేశ్‌లో దళిత మహిళా ఎమ్మెల్యేని వినాయకుడి మండపంలోకి రానివ్వలేదు. ఇలాంటి చేదు అనుభవాలు భారత రాష్ట్రపతి దంపతులకు కూడా ఎదురయ్యాయి. రాజస్థాన్‌లోని బ్రహ్మగుడిలోకి దళితులకు అనుమతి లేకపోవడం వల్ల, కోవింద్‌ దంపతులు బయట గుడిమెట్ల మీద పూజలు నిర్వహించుకున్నారు. బీజేపీ కూర్చోబెట్టిన రాష్ట్రపతి కదా ఆయన? వారికి వ్యతిరేకంగా ఎలా నడుచుకుంటారు? ఎలా ప్రవర్తిస్తారు? ”కులము పేరు చెప్పి కుళ్ళు పెంచగ నేల? / కులము జోలి యేల గుణమె చాలు! / వాసనగల పూవు పరిమళించిన రీతి / తెలివి రాణకెక్కు తెలుగు బిడ్డ” అని అన్నారు తెలుగు కవి నార్ల చిరంజీవి. కుల రహిత భారతీయ మానవ సమాజం రూపుదిద్దుకోవాలంటే తమిళనాడు మహిళ స్నేహ పార్దిబరాజాను ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతో సంఘర్షించి, కులమతాలు లేని తొలి భారతీయ మహిళగా ఆమె ప్రభుత్వం ఉంచి సర్టిఫికేట్‌ తీసుకోగలిగారు. ”దేశాభిమానం నాకు కలదని / వట్టిగొప్పలు చెప్పుకోకోరు / పూని ఏదైనను వొకమేల్‌ / కూర్చి జనులకు చూపవోరు” అని అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. ఈ మాటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఎవరైనా చెపితే బాగుండును. చెప్పినా, సరిగా అర్థం చేసుకుని స్పందించే గుణం అక్కడ ఉండాలి కదా? వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తూ ప్రధానికి ఉత్తరం రాసిన మేధావుల మీద రాజద్రోహం కేసు పెడితే ఇక ప్రజలు ఊరికే చూస్తూ ఊరుకుంటారా? కులం, మతం వద్దనేది వాటిమీద అక్కసుతో కాదు, అందరం మనుషులమే కదానన్న విశాల భావంతో – మనిషి పట్ల ఉన్న గౌరవంతో, ప్రేమతో..

డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌.

RELATED ARTICLES

Latest Updates