– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడి
– తనపై హత్యాయత్నం చేశారని కేసు పెట్టిన అయిషీఘోష్
– ముందుకు సాగని ఢిల్లీ పోలీసుల దర్యాప్తు
– వీడియోలో ఉన్నవారు తమ సభ్యులే.. : ఏబీవీపీ నేత అనిమా సోంకార్ వెల్లడి
జేఎన్యూ వైస్చాన్సలర్ను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వందమంది పార్లమెంట్ సభ్యులు లేఖ రాయనున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. తనపై హత్యాయత్నానికి కుట్రపన్నారని జేఎన్యూఎస్యూ అధ్యక్షు రాలు అయిషీఘోష్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం, అక్రమ నిర్బంధంలో ఉన్నట్టు ఆమె ఫిర్యాదు లో పేర్కొంది. జేఎన్యూఎస్యూ తరపున ఏడుగురు ఫిర్యా దు చేశారు.అందులో ఒక ప్రొఫెసర్
ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదులను స్థానిక పోలీసులు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ సిట్కు బదిలీ చేశారు.జేఎన్యూలో విద్యార్థులపైన, ప్రొఫెసర్లపైన దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. వివిధ మొబైల్ క్లిప్లు, వాట్సాప్ గ్రూప్ సంభాషణలు ఉన్నప్పటికీ, అందులో చాలామంది ఏబీవీపీతో సంబంధాలున్నట్టు ఆధారాలున్నా ఢిల్లీ పోలీసులు ఎవరినీ ప్రశ్నించలేదు. అదుపులోకి తీసుకోలేదు. దాడి చేసిన వారిని గుర్తించడానికి పోలీసులు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. కేసుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, స్టేట్మెంట్ల రూపంలో సాక్ష్యాలను కోరుతూ ఢిల్లీ పోలీసులు వార్తాపత్రికలో పబ్లిక్ నోటీసులు జారీ చేశారు.
అయిషీఘోష్ను కలిసిన డీఎంకే ఎంపీ కనిమొళి
డీఎంకే ఎంపీ కనిమొళి జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు అయిషీఘోష్ను కలిసింది. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. ఆమెకు సానుభూతి తెలుపుతూ, జేఎన్యూ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. దాడి చేసిన వారిని వదిలేసి, తీవ్రంగా గాయపడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు.
వీడియోలో ఉన్నవారు తమ సభ్యులే: ఏబీవీపీ నేత అనిమా జేఎన్యూలో జనవరి 5న విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడికి సంబంధించి వీడియోలో కర్రలు పట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ సంఘం సభ్యులేనని ఏబీవీపీ అంగీకరించింది. వీడియోలో ఉన్న మహిళ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన తమ కార్యకర్త అని ఏబీవీపీ అంగీకరించింది. ఏబీవీపీ ఢిల్లీ సహాయ కార్యదర్శి అనిమా సోంకార్ ఓ జాతీయ టీవీ ఛానల్లో చర్చల సందర్భంగా మాట్లాడుతూ వికాశ్ పటేల్, సర్వేందర్ కుమార్ తమ కార్యకర్తలని వెల్లడించారు.
వర్శిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా హింస సాధ్యం కాదు:
యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి, పోలీసుల అలసత్వ ప్రదర్శన లేకుండా జేఎన్యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపైన దాడి జరిగిందని జేఎన్యూటీఏ పేర్కొంది. ఈ మేరకు బుధవారం జేఎన్యూటీఏ ప్రకటన విడుదల చేసింది. ”విద్యార్థులు సురక్షితంగా లేనప్పుడు వారు తిరిగి హాస్టళ్లకు, తరగతి గదులకు ఎలా వెళ్లగలరు? ప్రొఫెసర్లు సురక్షితంగా లేనప్పుడు బోధించడానికి ఎలా తిరిగి వెళ్లగలరు?” అని ప్రశ్నించింది. వైస్ చాన్సలర్ ప్రకటన ఎలా ఉందంటే, తమ గాయానికి అవమానం కలిగినట్టు ఉందని మండిపడ్డారు.
(Courtesy: NT)