– ‘ది వైర్’పై కక్షపూరిత వైఖరి : అమర్త్యసేన్
– తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : భారత్లో ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కార్యకర్తల అరెస్టులు, ‘ది వైర్’ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్పై యూపీ సర్కారు కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ఆయన ది వైర్లో ఓ వ్యాసం రాస్తూ… ‘ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు భారతీయ పౌరుడిగా నేను సిగ్గు పడుతున్నాను. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం, మీడియాను లొంగదీసుకోవడంలో వారు సిద్ధహస్తులు’ అని పేర్కొన్నారు. భారత్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం ఈ మధ్య సర్వసాధారణమైందనీ, ‘ది వైర్’ విషయంలోనూ ఇది మరోసారి రుజువైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ వారిని జైళ్లలో వేస్తుందని విమర్శలు చేశారు. ఇదే విషయమై దాదాపు 3,500 మంది పరిశోధకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ‘ది వైర్’కు మద్దతుగా నిలిచారు. వరదరాజన్పై మోపిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిలో పలువురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా ఉండటం గమనార్హం.
వరవరరావును విడుదల చేయండి : పీఎంకు 40 మంది కవుల లేఖ
బీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన తెలుగు విప్లవ కవి వరవరరావును వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ 40 మంది కవులు ప్రధాని మోడీకి లేఖ రాశారు. 80 ఏండ్ల వయస్సున్న వరవరరావు.. వయస్సు సమస్యలతో బాధపడుతున్నారనీ, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ తాము ఈ లేఖ రాస్తున్నామని అందులో పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో జైళ్లో ఖైదీలను బెయిల్పై విడుదల చేస్తున్న ప్రభుత్వం.. వరవరరావునూ రిలీజ్ చేయాలని వారు కోరారు.
వారి అరెస్టు అప్రజాస్వామికం : హ్యూమన్ రైట్స్ వాచ్
హక్కుల కార్యకర్తలు గౌతం నవలఖ, ఆనంద్ తేల్తుంబ్డే అరెస్టులను హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్రంగా ఖండించింది. వారి అరెస్టు అప్రజాస్వామికమనీ, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ కేంద్రప్రభుత్వం జైళ్లలో పెడుతున్నదని విమర్శించింది. 2018 బీమా కోరేగావ్ కేసులో హక్కుల కార్యకర్తలను కావాలనే ఇరికించారని ఆరోపించింది. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడిన వారిని నిర్బంధించడానికే జైళ్లను ఉపయోగిస్తున్నదని విమర్శించింది. వీరితో పాటు జైళ్లో ఉన్న హక్కుల కార్యకర్తలనూ విడుదల చేయాలనీ, సిద్దార్థ్ వరదరాజన్పై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేసింది.
Courtesy: NT