– ఢిల్లీ సర్కార్ అనుమతి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకులు, వామపక్ష నేత కన్నయ్య కుమార్పై నమోదైన దేశద్రోహ కేసుపై విచారణ జరిపేందుకు ఢిల్లీ సర్కారు పోలీసులకు అనుమతులు ఇచ్చింది. 2016లో జేఎన్యూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలతో కన్నయ్య కుమార్తోపాటు 10 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు జమ్మూకాశ్మీర్ విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి పోలీసులకు రాష్ట్ర సర్కారు విచారణకు అనుమతి ఇవ్వకపోవ డంతో.. కేసు పెండింగ్లో ఉంది. ఇటీవల బీజేపీకి చెందిన పలువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ప్రభుత్వం కావాలనే ఈ కేసును ఆలస్యం చేస్తుందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే చర్యలు తీసుకుంటామని పది రోజులకు ముందు ఢిల్లీ సీఏం కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన ఫైలు ఇన్ని రోజులుగా హౌం శాఖ వద్ద పెండిం గ్లో ఉందనీ, న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం విచారణకు సంబంధించిన అనుమతులను మంజూరు చేసిందని తెలిపారు. కేసు విచారణను వేగవంతం చేయడానికి ఆయన విచారణకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, దేశద్రోహ కేసులు మోపబడినప్పుడు చార్జిషీట్లు దాఖలు చేసే ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం దర్యాప్తు సంస్థలు ఆయా రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బీహర్లో ఎన్నికలు ఉండటంతోనే తనపై కేసులు పెట్టారని కన్నయ్య ఆరోపించారు.
Courtesy Nava telangana