కల్లోల కాలంలో మతం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎ. సునీత

ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల పెద్దలూ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి తమ వంతు చర్యలు తీసుకుంటున్నారు. మక్కాలోని గ్రాండ్ మసీదు ఎనిమిది రోజుల పాటు మూసేసారు. మలేషియా, ఇండోనేషియాలలోని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై కొన్ని వారాల పాటు ప్రభుత్వాలే నిషేధం విధించాయి. ఇరాన్‌లో షియా మత పెద్దలు డాక్టర్లు, ఆరోగ్య రంగ శ్రామికులు దేశానికి సైనికులంత అవసరమని ఉద్ఘాటించారు. అమెరికా, యూరప్ ఖండాలలోనూ ఇదే జరుగుతోంది. మన దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత ముస్లిం మత పెద్దలు, ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోమని ప్రజలకు చెప్పారు. ప్రజలు గుమి కూడద్దని, ప్రభుత్వంతో సహకరించాలని అన్ని చర్చీల డియోసెస్ ప్రకటించాయి. తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం నుండి అనేక ఆలయాలను. పెద్ద ఎత్తున భక్తులు గుమికూడకుండా మూసేయటం జరిగింది.

ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది సీరియస్‌గా తీసుకుని తబ్లిగ్ జమాత్ తమ మత సమ్మేళనాన్ని క్యాన్సిల్ చేసి వుండాల్సింది. చెయ్యకపోవటాన్ని అనేకమంది ముస్లింలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు అజ్ఞానంతోనో లేక పరిస్థితుల వల్లో చేసిన దాన్ని ఉద్దేశ పూర్వకంగా చేశారని లేక కుట్ర పూరితంగా చేశారని అంటే ఎలా నమ్మటం? ఆ మత సమ్మేళనం పేరుతో ముస్లిములందరినీ కళంకితులుగా చూపెట్టటం సరైందేనా? దీని వల్ల ఇస్లాం పట్ల, ముస్లిముల పట్ల అపోహలు, భయాలు ఉన్న వారికి కొంత మానసిక సాంత్వన కలిగుండొచ్చు కానీ మొత్తం మీద భారత దేశ ప్రజానీకానికి మాత్రం అత్యంత హాని జరుగుతుందనేది మాత్రం సత్యం.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమయంలో మత సమూహాల ఆచరణలు, మత పరమయిన సమీకరణల స్వభావం కూడా వేగంగా మారాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఒక పక్క భయాలు, ఆందోళన, బందిఖానాలయిన ఇళ్లల్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో మతపరమయిన సాంత్వన అవసరం పెరుగుతుంటే, ఇంకో పక్క గుమిగూడటంపై విధించిన తప్పనిసరి ఆంక్షలు ఆ సాంత్వన దొరక్కుండా చేస్తున్నాయి. అన్ని మతాలకి, మతపరమయిన ఉత్సవాలకు గుమిగూడటం అత్యంత ఆవశ్యకం. కానీ అదే ప్రాణాంతకమయిన వైరస్‌ని వేగంగా వ్యాపింప చేస్తుందంటే ఏమి చెయ్యాలో అర్ధంకాక రోమ్ లోని కేథలిక్ చర్చిల నుండి, బుద్ధగయా లోని మహాబోధి ఆలయం వరకు, తిరుపతి గుడి నుండి అమెరికాలో ఎవాంజెలికల్ చర్చి వరకు మత పెద్దలందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎవరూ లేకుండా పూజలు, పునస్కారాలు, ఉత్సవాలు, ప్రబోధాలు, కన్ఫెషన్లు ఎట్లా చెయ్యటం, నడపడం అన్నది వారి ప్రశ్న.

గుర్తించాల్సింది ఏమిటంటే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు, ప్రజలు కూడా వేగంగా ఏమీ కదల్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతగా చెవిలో పోరుతున్నప్పటికీ ఈ వైరస్ ప్రభావాన్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు పెడ చెవిన పెట్టాయి. ఆలస్యంగా స్పందించాయి, సరే, ప్రభుత్వాలు మేలుకుని ప్రజలని బయటకి రావద్దని చెప్పిన తరువాత అయాచితంగా లభించిన సెలవులుగా భావించి ఇటలీ, బ్రిటన్ లలో ప్రజలు పండగ చేసుకున్నారని ఆయా దేశాల పత్రికలూ, ప్రసార మాధ్యమాల్లో అనేకమంది రాశారు, చెప్పారు. ఇటలీ ప్రజలయితే ‘ప్రపంచ ప్రజలారా మేలుకోండి, మా లాగా మీరు ప్రవర్తించొద్దు, మీ ప్రభుత్వాలు చెప్పినట్లు చెయ్యండి’ అని పదే పదే చెప్పారు. మన దేశంలో మార్చి మధ్య నుండి లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో చాలామంది సెలవలుగా భావించి బయట తిరిగారు. భౌతిక దూరం పాటించటం అటుంచి, పార్టీలు చేసుకున్నారు! విదేశాలనుండి దేశంలోకి వచ్చి, క్వారంటైన్ పాటించకుండా పార్టీలు చేసుకున్న ప్రముఖులు, పెళ్లిళ్లు చేసుకున్న ఘనులు, పారిపోయిన పెద్ద ఆఫీసర్లు, డాక్టర్ల గురించి వార్తా పత్రికలు చాలానే రాశాయి. కేరళలో, ఇటలీనుండి తిరిగొచ్చిన ఇటువంటి ఒక కుటుంబం తిరగటం వల్లే వైరస్ బాగా వ్యాప్తి చెందిందన్నది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే.

కానీ ప్రభుత్వాలు, స్పోర్ట్స్, వినోద ప్రపంచాలతో పాటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల పెద్దలూ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి తమ వంతు చర్యలు తీసుకుంటున్నారు. మక్కా (సౌదీ అరేబియా) లోని గ్రాండ్ మసీదు ఎనిమిది రోజుల పాటు మూసేసారు, మొత్తం శుభ్రం చేసిన తరువాత కొంత మందికి మాత్రమే తెరిచారు. దుబాయ్‌లో శుక్రవారం ప్రార్థనలని 15 నిముషాలకి కుదించారు. మలేషియా, ఇండోనేషియాలలోని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలపై కొన్ని వారాల పాటు ప్రభుత్వాలే నిషేధం విధించాయి. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం, తజికిస్తాన్‌లో మత పెద్దల కౌన్సిల్ ప్రజలని మసీదులలో గుమికూడొద్దని చెప్పారు. ఇరాన్‌లో షియా మత పెద్దలు డాక్టర్లు, ఆరోగ్య రంగ శ్రామికులు దేశానికి సైనికులంత అవసరమని ఉద్ఘాటించారు. అమెరికా, యూరప్ ఖండాలలో కూడా ఇదే జరుగుతోంది. మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత దేవుబంద్ నుండి, ఫిరంగి మహల్ నుండి ముస్లిం మత పెద్దలు, అలాగే షియా పెద్దలు, అనేక నగరాల్లో మత పెద్దలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోమని ప్రజలకు చెప్పారు. అన్ని చర్చీల డియోసెస్ కూడా ప్రజలని గుమికూడద్దని, ప్రభుత్వంతో సహకరించాలని, సహకరిస్తామని ప్రకటించాయి. చాలా మంది ఆన్‌లైన్ బోధనలు, ప్రబోధాలు చేస్తున్నారు. తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం నుండి అనేక ఆలయాలను పెద్ద ఎత్తున భక్తులు గుమికూడకుండా మూసేయటం జరిగింది.

ఈ పరిస్థితుల మధ్య, ఢిల్లీలో మర్కజ్ అనే తబ్లీగి జమాత్ అనే ముస్లిం వర్గం నడిపే ఆశ్రమంలో కరోనా ప్రబలిందనే వార్త వెలువడింది. దీంతో, మన దేశంలో అంతర్లీనంగా వుండే కమ్యూనల్ వైరస్ ఒక్కసారిగా ప్రజ్వరిల్లి విపరీతంగా వ్యాపించింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించక ముందు, మార్చి 13 నుండి 15 వరకు అంతర్జాతీయ సెమినార్ పెట్టుకున్న తబ్లీగ్ లు, ఢిల్లీ ప్రభుత్వం మీటింగ్‌లు వద్దని అన్న తరువాత మత సమ్మేళనాన్ని మధ్యలో క్యాన్సిల్ చేశారు. అయితే, అనేక మంది (తమ టికెట్లు తర్వాత బుక్ అయ్యి ఉండటంతో) ఢిల్లీలో ఉండిపోయారు. ఈ లోపల దేశం మొత్తం మీద లాక్‌డౌన్ అయ్యి, ఆ తరువాత అంతర్జాతీయ ప్రయాణాలు క్యాన్సిల్ అవటంతో చాల మంది విదేశీయులు కూడా దేశంలోనే ఉండిపోయారు. బయటికి ఒక్కొక్కళ్ళు వెళ్లే వీలుండటంతో కొంత మంది బయట తిరిగారు. వీళ్లల్లో చాలా మందికి కరోనా ఉందని టెస్టులు చేయటంతో తెలిసింది. అప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఈ సెమినార్‌ కి వెళ్లిన వారికి కరోనా వచ్చిందని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి రాశాయి.

అయితే దాన్ని చాలా రోజులు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి మేలుకుని మేమేదో చేస్తున్నాం అని చెప్పటానికో, ప్రజల్లో కరోనా గురించి భయం కల్గించటానికో ఆ కేసులకి పెద్ద ప్రచారం కల్పించింది. అంతే, మిగిలిన మేధావులు చిలవలు, పలవలుగా పాత దేశీయ, విదేశీ వీడియోల్ని తమదయిన శైలిలో వ్యాఖ్యానించారు. తబ్లీగి జమాత్ మాత్రమే కాక, దానితో ఏ మాత్రం ఏకీభవించని ముస్లింలందరు, -అంటే..షియాలు, సున్నీలు, బరెల్విలు, ఎహ్ల్ హదీస్, వహాబీలు – కరోనాని వ్యాప్తి చెయ్యటానికి, తద్వారా భారతదేశ సమగ్రతని, భద్రతని దెబ్బ తీస్తున్నారని ప్రచారం మొదలెట్టారు. సామాజిక మాధ్యమాల్లో, టెలివిజన్ న్యూస్ పేరుతో నడిచే వినోదంలో వచ్చేదంతా నిజమని నమ్మే అనేక మంది సామాన్య ప్రజలు ఇది ముస్లింలు మాత్రమే వ్యాప్తి చేసే వైరస్ అని భయపడి, ఆ మతస్థులు అమ్మేవి బహిష్కరిస్తున్నారు. ముస్లింలను తిడుతున్నారు, కొన్ని చోట్ల కొట్టారు కూడా. ఇంకా హేయమైన విషయమేమిటంటే కొన్ని చోట్ల ఊర్ల నుండి, ఆస్పత్రుల నుండి ముస్లింలని వెళ్లగొట్టటం.

ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది సీరియస్‌గా తీసుకుని తబ్లిగ్ జమాత్ తమ మత సమ్మేళనాన్ని క్యాన్సిల్ చేసి వుండాల్సింది. చెయ్యకపోవటాన్ని అనేకమంది ముస్లింలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ వారొక్కరే చేశారా ఆ పని? వారు అజ్ఞానంతోనో లేక పరిస్థితుల వల్లో చేసిన దాన్ని ఉద్దేశ పూర్వకంగా చేశారని లేక కుట్ర పూరితంగా చేశారని అంటే ఎలా నమ్మటం? ఆ మత సమ్మేళనం పేరుతో ముస్లిములందరినీ కళంకితులుగా చూపెట్టటం సరైందేనా? దీని వల్ల ఇస్లాం పట్ల, ముస్లిముల పట్ల అపోహలు, భయాలు వున్న వారికి కొంత మానసిక సాంత్వన కలిగుండొచ్చు కానీ మొత్తం మీద భారత దేశ ప్రజానీకానికి మాత్రం అత్యంత హాని జరుగుతుందనేది మాత్రం సత్యం. దీన్ని భిన్న మతస్థుల మధ్య పోరాటంగానో లేక ముస్లింల దేశ భక్తి రాహిత్యానికి సూచనగా చూడటమెంత అవివేకమో, కొవిడ్- 19 లాక్‌డౌన్ తరువాత జరుగుతున్న సహాయ కార్యక్రమాలని చూసినప్పుడు స్పష్టమవుతుంది.

కేరళ నుండి పంజాబ్ దాకా, కశ్మీర్ నుండి అస్సోం దాకా అనేక రకాల మతస్థులు, మతసంస్థలు కలిసి చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుంది. అనేక ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదులు పని కోల్పోయిన శ్రామికులకు భోజనాలు, బియ్యం ఇంకా అనేక రకాల సహాయాలు చేస్తున్నాయి. తిరుమలని శుభ్రం చెయ్యటానికి ఒక ముస్లిం భక్తుడు ఒక వాహ నాన్ని దానం చేస్తే దానితో డిసెన్ఫెక్షన్ జరుగుతోంది. వైరస్ సోకి చనిపోయిన హిందూ స్త్రీ పార్థివ దేహాన్ని మొయ్యడానికి బంధువులు భయపడితే చుట్టుపక్కల ముస్లిం యువకులు మోశారు. కేరళలో మసీదులు, చర్చీలు పెళ్ళిళ్ళ నుండి అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తబ్లిగ్ శాఖే, తమ తమ కార్యాలయాలని శుభ్రం చేసి, క్వారంటైన్ కోసం వాడుకొమ్మని ప్రభుత్వానికి చెప్పింది. ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యట్లేదు.

ఏప్రిల్ మొదటి వారం వరకు వచ్చిన వార్తలని గమనిస్తే అర్ధమయిందేమిటంటే, ఈ మహమ్మారిని భారత దేశానికి మొదట తీసుకొచ్చింది విదేశాలకి వెళ్లిన, అక్కడి నుండి వచ్చిన భారతీయులు. అందులో అన్ని మతాల, వర్గాల వారు వున్నారు. పక్కనున్న చైనాలో డిసెంబర్ నుండి వ్యాధి విజృంభిస్తున్నప్పటికీ, చైనా వైరస్ అని పేరు పెట్టి, చైనా గురించిన గురించి కుట్ర సిద్ధాంతాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి తప్ప, వారు తీసుకున్న జాగ్రత్తల గురించి కాలేదు. మార్చి మధ్య దాకా కేరళ తప్ప మిగిలిన ప్రభుత్వాలు తమ తమ పనుల్లో మునిగిపోయి వివిధ రకాల వేగంతో కదిలి లాక్ డౌన్ ప్రకటిస్తూ వచ్చాయి. ఈ లోపల డాక్టర్లని, నర్సులని ఇల్లు ఖాళీ చెయ్యాలని అనేక మంది బలవంతం చేశారు. క్వారంటైన్ సదుపాయాలు కల్పించటానికి మరి కొన్ని రోజులు పట్టింది.

దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత లక్షలాది మంది వలస కార్మికులు ఇంటికి పోవటానికి రోడ్లెక్కారు. కేవలం లాక్‌డౌన్‌తో కుదరదని, ప్రభుత్వాలు, టెస్టింగ్ పెద్ద ఎత్తున చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటుంటే కూడా మిగిలిన దేశాల ప్రభుత్వాలలాగే మన ప్రభుత్వాలు కూడా నెమ్మదిగా మార్చి నెల చివరికి దీన్ని సీరియస్‌గా తీసుకోవటం మొదలుపెట్టాయి. దాదాపు మార్చి మూడవ వారం వరకూ చాలా రకాల మత పరమయిన సమీకరణలు, ఉత్సవాలు ఆగలేదు. సోషల్ డిస్టెన్సింగ్ పూర్తిగా అమలు కాలేదు. ఇప్పటికీ జరగాల్సినన్ని టెస్టులు అన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు. మరి వీటన్నిటి మధ్యలో మూడవ వంతు కరోనా కేసులు మాత్రమే తెచ్చిన తబ్లిగ్ సమావేశంపై మాత్రమే దృష్టి పెట్టి, మిగిలిన కరోనా కేసుల్ని పక్కన పెట్టటంలో ఔచిత్యమేమిటి? ముస్లిమేతర ప్రజలు, కొవిడ్ -19 కేవలం ముస్లింలకి వచ్చే వ్యాధిగా మాత్రమే భావిస్తే, భారత దేశం ఈ మహమ్మారిపై యుద్ధం ఎలా గెలవబోతోందో ఆ దేవుడికే తెలియాలి!

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates