నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కరోనా బాధితుడు వైద్యంపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందించడం లేదంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. శ్వాస ఆడక తల్లదిల్లిపోయాడు.
వెంటిలేటర్ పెట్టమని అడిగితే మాత్ర ఇచ్చి పంపారని వాపోయాడు. తాను ఇక్కడ ఉండలేనని, హైదరాబాద్కు పంపెయ్యమని లేకపోతే ఏదైనా వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ”నేను ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ఆ రోజు టెస్టులు చేస్తామని పైకి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యులను సంప్రదించేందుకు అనుమతి అడుగుతున్నాను. సిస్టర్లు వస్తున్నారు, వెళ్తున్నారు. నాకు టెస్టులు చేయలేదు. నిన్న రాత్రి 1.30గంటలకు వచ్చి కొవిడ్ పరీక్షలు చేశారు. విపరీతంగా జ్వరం పెరుగుతోంది” అంటూ తన ఆవేదను వీడియోలో వ్యక్తం చేశాడు.
వైద్యాధికారులను ఆరా తీస్తే అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. షుగర్ ట్యాబ్లెట్, ఇన్సులిన్ విషయంలో బాధితుడికి, డ్యూటీ వైద్యుడికి మధ్య వాగ్వాదం జరిగిండంవల్లనే కోపంతో బాధితుడు వీడియో తీసి పోస్టు చేశాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజు వెల్లడించారు.