– ఇండ్లు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు
– ట్రంప్ పర్యటనకు ముందు రోజు ఘటన
గాంధీనగర్: అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనకు మోడీ సర్కారు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ సరదర్భంలో మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ను మోడల్స్టేట్గా ట్రంప్నకు చూపించాలనే క్రమంలో ‘గోడ’ చాటు వ్యవహారాలు చాలానే చేసింది. డెబ్బై యేండ్ల స్వాతంత్య్ర భారతంలో పేదరికాన్ని నిర్మూలించలేక.. అభాగ్యుల బతుకులు ప్రపంచానికి కనిపించకుండా..అడ్డంగా బీజేపీ సర్కార్ ఏకంగా ఏడడుగుల గోడను కట్టగలిగింది. కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. సరిగ్గా ట్రంప్ పర్యటనకు ముందు రోజు (ఆదివారం) ఆనంద్ జిల్లాలోని మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతమైన ఖంభట్లో అల్లర్లు చెలరేగాయి. హింసాత్మక ఘటనలో 30 ఇండ్లతో సహా పలు దుకాణాలకు దుండగులు నిప్పంటించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఖంభట్లోని అక్బర్పురా అనే ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వాగ్వివాదం కాస్త.. తీవ్ర హింసకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ రాళ్లవర్షం కురిసింది. ఈ సమయంలో ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలతో సహా 25 వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా సమీపంలోని ఇండ్లకు, వ్యాపార ప్రాంతాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ హింసను ప్రేరేపించిన అంశంపై ఇంకా స్పష్టంగా తెలియరాలేదనీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని ఆనంద్ జిల్లా ఎస్పీ దివ్య మిశ్రా తెలిపారు. వివాదాస్పద పారత్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఐఎఫ్)ను మోహరించామనీ, ఈ కేసులో 46 మందిని నిందితులుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నామని మిశ్రా చెప్పారు.
Courtesy: NT