ప్రజాస్వామ్యం లేకుండా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మెజారిటీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్డిటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కశ్మీర్ పరిణామాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. భారత దేశం పాశ్చాత్య ఏతర దేశాలలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి దేశము. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జరిగినదంతా పూర్తి అప్రజాస్వామిక చర్య. తమ భూమిని ఎలా వినియోగించుకోవాలి అనే హక్కు పూర్తిగా కాశ్మీరీలకే ఉంటుంది. అది వారి న్యాయబద్ధమైన హక్కు. కాశ్మీర్ రాజకీయ నాయకుల్ని మాజీ ముఖ్య మంత్రుల్ని గృహనిర్బంధం, ముందస్తు అరెస్టు చేయటం అనేది వలస పాలకులను అనుసరించిన పద్ధతి. వలస పాలకులు 200 ఏళ్ళు మనల్ని ఇలాగే పరిపాలించారు. స్థానిక ప్రజా నాయకులతో చర్చించకుండా వారి మాటలు వినకుండా ఏనాడు ఎవ్వరు న్యాయాన్ని చేకూర్చ లేరు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసే దారుల్ని మూసేసే చర్యను కేంద్ర పాలకులు అనుసరించారు అంటూ అమర్త్యసేన్ విమర్శించారు.