ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేస్తే కరోనా వైరస్ రాదని చినజీయర్ స్వామి చెప్పినట్లు ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా పసుపు కొమ్ముల కోసం మహిళలు తెగ వెతుకుతున్నారు. ఎందుకంటారా? పసుపు కొమ్ములు ధరిస్తే కరోనా వైరస్ దరి చేరదన్న ప్రచారాన్ని నమ్మి వారంతా పసుపు కొమ్ముల కోసం ఆరాటపడుతున్నారు. ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేస్తే కరోనా వైరస్ రాదని చినజీయర్ స్వామి చెప్పినట్లు ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా నిజమని నమ్మిన మహిళామణులు చాలా మంది ఇలాగే చేశారు.
దీంతో చినజీయర్ స్వామి తరపున శ్రీఅహోబిల జీయర్ స్వామి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, వీటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమని శ్రీఅహోబిల జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్లలోంచి నుంచి బయటకు రాకూడదని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని తెలిపారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని శ్రీఅహోబిల జీయర్ స్వామి అన్నారు.