న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులను తమ స్వస్థలాలకు తరలించడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే చార్జీల్లో 85శాతం కేంద్రమే భరిస్తుందనీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే రైల్వే చార్జీల్లో కేంద్రం భరిస్తున్నదెంత? వలసకార్మికుల నుంచి వసూలు చేస్తోందెంత? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. దీనిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. రైల్వేచార్జీలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మోడీ సర్కారు తిరస్కరించింది. సామాజిక కార్యకర్త జగదీప్ ఎస్. ఛొక్కర్ వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)పై సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 5న విచారణ జరిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రైల్వే చార్జీలలో కేంద్రం 85శాతం వాటాను భరిస్తోందన్న విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజరు కిషన్ కౌల్ ప్రశ్నించగా.. దానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి తుషార్ మెహతా తిరస్కరించారు. ” వివరాల వెల్లడికి నాకు సూచనలు అందలేదు.
కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి దేశవ్యాప్తంగా అనేక రైళ్లు, బస్సులు సేవలను అందిస్తున్నాయి” అని తుషార్ మెహతా స్పందించడం గమనార్హం. కేంద్రం చేస్తోన్న పరస్పర విరుద్ధ వాదనలు.. స్వస్థలాలకు వెళ్లాలనుకొనే వలస కార్మికులను గందరగోళంలోకి నెడుతున్నాయని ఛొక్కర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదించారు. ఒకవేళ కేంద్రం 85శాతం ఖర్చు ను భరించినప్పటికీ, మిగిలిన 15శాతం చార్జీలను భరించడం వలస కార్మికు లకు చాలా భారమనీ, దీనినీ భారత రైల్వే భరించేలా ఆదేశించాలని న్యాయ స్థానాన్ని కోరారు.
Courtesy: NT