భారత్లో కరోనా వైద్య పరీక్షలకు కాలయాపన
‘ర్యాపిడ్’ టెస్టుతో శరవేగంగా చైనా ఫలితాలు
న్యూఢిల్లీ 13 : ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు లక్ష దాటాయి. ఓ వైపు వైరస్ పుట్టినిల్లు చైనాలో దాని ఇన్ఫెక్షన్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు ఇటలీ, ఇరాన్, దక్షిణకొరియాలో వేగంగా విస్తరిస్తోంది. భారత్లోనూ కేసుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతూపోతోంది. ఈనేపథ్యంలో అనుమానిత లక్షణాలు ఉన్నవారికి కరోనా వైద్యపరీక్షల నిర్వహణకు చైనాలో 15 నిమిషాలే పడుతుంటే.. భారత్లో మాత్రం 24 గంటలకుపైనే పడుతోంది. అమెరికాకు చెందిన ‘బయో మెడోమిక్స్’ కంపెనీ అభివృద్ధిచేసిన ర్యాపిక్ కరోనావైరస్ పరీక్షా పద్ధతిని చైనా వాడుతోంది. ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలూ దీన్నే వినియోగిస్తున్నాయి. ఇందులో భాగంగా రోగి చేతి వేలు నుంచి రక్తం శాంపిల్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. గర్భ నిర్ధారణకు ఇంటివద్ద నిర్వహించుకునే పరీక్ష తరహాలోనే ఇది కూడా పనిచేసి, సత్వరం ఫలితం ఇస్తుంది. ఇక మనదేశంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తి నుంచి రక్తం శాంపిళ్లు సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపుతారు. అక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) పద్ధతిలో వాటిని పరీక్షించి ఆరోగ్య నివేదిక ఇస్తారు. ఇదంతా జరగడానికి రోజుకుపైనే పడుతోంది. ఈ పరిజ్ఞానంతో భారత్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రోజూ 750 శాంపిళ్లనే పరీక్షించగలుగుతోంది. మరోవైపు స్విట్జర్లాండ్ ఫార్మా దిగ్గజం రోచే అభివృద్ధిచేసిన కరోనా గుర్తింపు పరీక్షా పద్ధతికి అమెరికా ఆహార-ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఈ పరీక్ష ద్వారా మూడున్నర గంటల్లోనే అనుమానిత లక్షణాలున్న వ్యక్తికి కరోనా ఉందో, లేదో తేల్చేయొచ్చు. ఈ పద్ధతిలో భారీ వైద్యపరీక్ష యంత్రాల ద్వారా ఒక రోజులో దాదాపు 4,128 పరీక్షలు చేసే వీలుంటుంది.
Courtesy Andhrajyothi