– చట్టానికి విరుద్ధంగా పోతే ప్రశ్నిస్తాం : హైకోర్టు
–హైదరాబాద్
రాష్ట్ర సర్కార్ ఆర్టీసీ రూట్లను ప్రయివేటు ఆపరేటర్లకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం ప్రాథమిక దశలో ఉన్నదనీ, ఇప్పుడే దాన్ని తప్పుబట్టలేమని హైకోర్టు అభిప్రాయపడింది. క్యాబినెట్ ప్రతిపాదనకు పూర్తి రూపం రావడానికి సమయం పడుతుందని చెప్పింది. రూట్ల ప్రయివేటీకరణ చేసేందుకు లోక్సభ ఆమోదంతో కేంద్ర సర్కార్ ఇచ్చిందని చెప్పింది. 5100 రూట్లను ప్రయివేటుపరం చేయాలని క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు వేసిన పిల్ను మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు మోటారు వాహన చట్టంలోని పలు విషయాల్ని ప్రస్తావించింది. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 67లోనే ఆర్టీసీకి సమాంతరంగా ప్రయివేటు బస్సులు నడిపేందుకు కేంద్రం రాష్ట్రాలకు సమ్మతి ఇచ్చిందని బెంచ్ గుర్తు చేసింది. ఆర్టీసీ మాత్రమే ఉండాలనే వాదన ఆ నిబంధన అనుమతించదనీ, ప్రయివేటు బస్సు రూట్ల పర్యవేక్షణాధికారం కూడా రాష్ట్రానికే ఉండేలా కేంద్రం చట్టం చేసిందనీ, ప్రయివేటు బస్సులు ఉండే వెసులుబాటు చట్టంలో ఉందని చెప్పింది. ఆర్టీసీ రూట్లన్నీ నోటిఫై అయ్యాయని, వాటిని ప్రయివేటీకరించేందుకు చట్టంలోని 104 సెక్షన్ అనుమతించదని లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
ఆ సెక్షన్ వరకూ అది కరెక్టే కావచ్చునని, అయితే ఆ చట్టంలోని ఇతర సెక్షన్లు అన్నింటినీ పూర్తిగా వర్తింపజేస్తే దాని పరిధి కొంచెమేనని బెంచ్ చెప్పింది. సెక్షన్ 102 ప్రకారం క్యాబినెట్ ప్రయివేటు రూట్ల అనుమతి ప్రతిపాదనను పరిశీలించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతిపాదన మాత్రమే చేసిందనీ, ఆ తర్వాత డ్రాఫ్ట్ పాలసీపై ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలనీ, రూట్ల ప్రయివేటు ప్రభావిత ఏరియాల్లో పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, ఎంపిక చేసిన ప్లేస్ల్లో 30 రోజుల్లోగా ప్రజల నుంచి అభ్యంతరాలు తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకున్నాక జీవోకు వీలుంటుందని, ఈ తంతంగం అయ్యాకే క్యాబినెట్ నిర్ణయానికి చట్టబద్ధత వస్తుందని బెంచ్ నిబంధనల్లోని విషయాల్ని తెలియజేసింది. ఇప్పుడు న్యాయ సమీక్ష చేయలేమని అభిప్రాయపడింది. ప్రయివేటుకు పెద్ద పీట వేస్తున్న రోజుల్లో సోషలిస్టు పద్ధతుల్లోనే ఉంటామంటే ఎలాగని బెంచ్ ప్రశ్నించింది.
సమ్మె చేస్తుండగా ప్రయివేటు రూట్లకు వీలుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని, రహస్య ఒప్పందాలు ఉండవచ్చునని పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఎవిడెన్స్లు చూపాలని బెంచ్ కోరింది. సీఎం కూడా ఆర్టీసీ ఉండదని చెబుతున్నారనే వాదనను బెంచ్ తోసిపుచ్చింది. సెక్షన్ 102 ప్రకారం క్యాబినెట్ ప్రయివేటు రూట్ల అనుమతి ప్రతిపాదనను పరిశీలించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతిపాదన చేసింది.
ఆ తర్వాత డ్రాఫ్ట్ పాలసీపై ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. రూట్ల ప్రయివేటు రూట్ల ప్రభావిత ఏరియాల్లో పత్రికల ద్వారా ప్రజలకు చెప్పాలి. ఎంపిక చేసిన చోట్ల 30 రోజుల్లోగా ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే జీవో ఇవ్వాలి..
అని నిర్ధేశిస్తోంది. ఈ తంతంగం అయ్యాకే క్యాబినెట్ నిర్ణయానికి చట్టబద్ధత వస్తుంది. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ఈ దశలో తప్పపట్టడానికి కోర్టుకు పరిధి లేదు. ఒక్కసారిగా 5100 రూట్లను ప్రయివేటు ఆపరేటర్లకు ఇచ్చేస్తే ఆర్టీసీలో పనిచేసే 48 వేల కుటుంబాలు రోడ్డునపడతాయని లాయర్ చెప్పగా ఈ విషయం గురించి కేంద్రం ఆమోదించిన చట్టంలో లేదని బెంచ్ పేర్కొంది. సెక్షన్ 67 కింద ప్రయివేటు రూట్ల ఎంపిక, సెక్షన్ 68 కింద రూట్ల ఖరారు చేసే అధికారం ఆర్టీఏ అధికారికి చట్టం కల్పించిందని కోర్టు చెప్పింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Courtesy Navatelangana..