పరిష్కారం ఏమిటో..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 

Image result for ayodhya issue latestదశాబ్దాలుగా నలుగుతున్న సమస్య సమసిపోతుందా? ఏళ్ల  తరబడి కోర్టుల్లో నానిన అయోధ్య  భూ వివాద దావాకు సర్వోన్నత న్యాయస్థానంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అత్యంత కీలకమైన కేసులో వాదనలను ముగించిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వాయిదా వేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇన్నేళ్లుగా నడిచిన వివాదం పూర్వాపరాలు
ఇదీ.. అయోధ్య వివాదం

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో 1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ సేనాని మీర్‌ బాఖీ ఒక మసీదును నిర్మించారు. బాబర్‌ పేరు మీద ఆ ప్రార్థనా స్థలాన్ని బాబ్రీ మసీదుగా పిలుస్తున్నారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న రామ మందిరాన్ని నేలకూల్చి ఈ మసీదును నిర్మించారని హిందుత్వవాదులు నమ్ముతున్నారు. అది రాముడి జన్మస్థలమని వాదిస్తున్నారు.
* 1859లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం అక్కడ ఒక కంచెను నిర్మించి, ఆ చోటును రెండు భాగాలుగా చేసింది. ప్రార్థనాస్థలంలోని లోపలి భాగంలో ముస్లింలు, వెలుపలి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసింది.
* మసీదు వెలుపల నిర్మించిన వేదిక (రామ్‌ ఛబుత్ర)పైన ఒక మండపాన్ని నిర్మించేందుకు అనుమతించాలని 1885లో మహంత్‌ రఘుబీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.
* 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలు కనిపించాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి. రెండు పక్షాలూ కోర్టును ఆశ్రయించాయి. మొత్తమ్మీద 2.77 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది.
* 1989లో బాబ్రీ మసీదు పక్క స్థలంలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషద్‌ (వీహెచ్‌పీ) శంకుస్థాపన చేసింది. మసీదును వేరే చోటుకు మార్చాలని వీహెచ్‌పీ నేత దేవకీ నందన్‌ అగర్వాల్‌ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో అయోధ్య స్థల యాజమాన్యంపై అప్పటివరకూ దాఖలైన నాలుగు పిటిషన్లు అలహాబాద్‌ హైకోర్టులోని ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.
* 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును    ‘కరసేవకులు’ కూల్చివేశారు.

హైకోర్టు తీర్పుసుప్రీంలో సవాల్‌…

అయోధ్య స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్‌ దావాలపై అలహాబాద్‌ హైకోర్టు 2010లో కీలక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టంచేసింది. తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి బుధవారం వరకూ రోజువారీగా విచారణ సాగించింది.

సుప్రీం కోర్టులో ఎవరి వాదనేంటి?

గత 40 రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు సాగాయి. కక్షిదారుల ఆస్తి హక్కులు, కేసులో వారి అర్హతలు సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

హిందూ పక్షాల వాదన 

* అయోధ్యలో రామాలయాన్ని ఇంచుమించుగా 11వ శతాబ్దంలో విక్రమాదిత్య చక్రవర్తి నిర్మించి ఉంటారు. ఆ గుడిని 1526లో బాబర్‌ లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ధ్వంసం చేశారు.
* వాల్మీకి రామయాణం, స్కంద పురాణం, వశిష్ఠ సంహిత వంటి పురాతన గ్రంథాలు, క్రీస్తు శకం 400 సంవత్సరంలో ఫా హియన్‌, 600-670 మధ్యలో హ్యుయెన్‌త్సాంగ్‌ వంటి యాత్రికుల రచనల్లో అయోధ్య, అక్కడి పూజల ప్రస్తావన ఉంది. బాబర్‌ సరయూ నదిని దాటి అయోధ్యను చేరినట్లు తన పుస్తకం బాబర్‌నామాలో రాశారు. అయితే అక్కడ మసీదు ఉన్నట్లు ఆయన ప్రస్తావించలేదు. మొఘల్‌ చక్రవర్తులు రచించిన ‘ఐనీ అక్బరీ’, ‘తుజుక్‌ ఎ జహంగిరీ’లోనూ ఈ నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు దీన్ని నమోదు చేశారు.
* ఆ మసీదుపై ఇస్లామిక్‌ రచనలు కొన్ని పవిత్ర ఖురాన్‌, హదిత్‌కు విరుద్ధంగా ఉన్నాయి.
* రాముడి జన్మస్థానం అయోధ్యేనన్న విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయి. జన్మస్థానంలో పూజలు చేసే హిందువుల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
* వివాద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని, అది ధ్వంసమైందని పురావస్తు శాఖ నివేదిక కూడా చెబుతోంది.
* మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అయితే రామజన్మ భూమి ఒక్కటే ఉంది.

ముస్లిం పక్షాల వాదన

* వివాదాస్పద ప్రాంతంలో 1528 నుంచి మసీదు ఉండేది. 1855, 1934లో ఈ ప్రార్థనా మందిరంపై దాడులు జరిగినట్లు రికార్డుల్లో నమోదైంది. 1949లో చొరబాటు కేసు దాఖలైంది. ఇవన్నీ మసీదు ఉనికిని నిర్ధారిస్తున్నాయి.
* వాల్మీకి రామాయణం కానీ రామచరిత మానస్‌ కానీ అయోధ్యలో రాముడి జన్మ ప్రదేశాన్ని నిర్దిష్టంగా నిర్వచించలేదు.
* మసీదుకు బాబర్‌ నిధులు ఇచ్చినట్లు, దాన్ని ఆ తర్వాత నవాబులూ కొనసాగించినట్లు బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గుర్తించింది.
* 1885లో దాఖలైన దావాలో సమర్పించిన అనేక పత్రాలు ఈ మసీదు ఉనికిని ధ్రువపరుస్తున్నాయి. ఆ స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేది. 1949 డిసెంబరు 22, 23 తేదీల వరకూ అక్కడ ఈద్‌ ప్రార్థనలు జరిగాయి.
* రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. అక్కడ ఆలయం ఉండేదని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా, అసంపూర్తిగా ఉంది. అది వ్యాఖ్యానమే. శాస్త్రీయ ఆధారం కానేకాదు.
* 1989 వరకూ హిందువులు ఆ వివాదాస్పద స్థలంపై హక్కులు కోరలేదు. ఆ ప్రదేశాన్ని మాకు అప్పగించాలని మేం మొదట దావా వేశాం. ఆ తర్వాతే హిందువులు పిటిషన్‌ వేశారు.
* వివాదాస్పద ప్రాంతంలోని ‘రామ్‌ ఛబుత్ర’, ‘సీతా రసోయి’ హిందువుల అధీనంలో ఉన్నంత మాత్రాన వారికి స్థల యాజమాన్య హక్కులు దక్కవు. ప్రార్థనా హక్కులు మాత్రమే లభిస్తాయి.
* 1992 డిసెంబరులో కూల్చివేతకు గురికావడానికి ముందున్న రీతిలో బాబ్రీ మసీదును పునరుద్ధరించాలి.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates