పాలకుల అలసత్వానికి అమాయక వలస కార్మికులు బలైపోయారు. లాక్డౌన్తో ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లేందుకు పయణమైన కష్టజీవులు రైలు పట్టాలపై విగత జీవులుగా మిగిలారు.
ఔరంగాబాద్: పాలకుల అలసత్వానికి అమాయక వలస కార్మికులు బలైపోయారు. లాక్డౌన్తో ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లేందుకు పయణమైన కష్టజీవులు రైలు పట్టాలపై విగత జీవులుగా మిగిలారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 16 మంది వలస కార్మికులను పొట్టన పెట్టుకున్నాయి. తమను తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో కాలినడకన రైలు పట్టాల వెంట వెళుతూ బడుగు జీవులు మృత్యువాత పడ్డారు.
ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నడిచి నడిచి అలసిపోయి కొంత మంది కార్మికులు పట్టాలపైనే, నిద్రపోగా కొంత కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఖాళీ బోగీలతో వెళుతున్న గూడ్స్ రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. కార్మికులపై నుంచి దూసుకుపోవడంతో 16 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. . కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌరంగాబాద్-జల్నా మార్గంలో శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దక్షిణమధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలోని నాందేడ్ డివిజన్లో బద్నాపూర్-కర్మద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ ప్రమాద చోటుచేసుకుంది. మృతుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు మహిళలు ఉన్నారు.
జల్నాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు తమ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్కు తిరిగి వెళ్లేటప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఔరంగాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.