పాట్నా : జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ వాహనశ్రేణిపై నిరసనకారులు రాళ్లదాడి చేశారు. బుధవారం బీహార్లోని సుపౌల్ జిల్లాలోని బహిరంగ సభ ముగించుకొని సహార్సా ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆయన వాహనాలపై మార్కెట్ ప్రాంతంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో కన్నయ్య సహా ఎవరికీ గాయాలు కాలేదు. కొన్ని వాహనాల అద్దాలు మాత్రం ధ్వంసమయ్యాయి. గత శనివారం కూడా కొంతమంది వ్యక్తులు సరన్ జిల్లాలో కన్నయ్య కుమార్ వాహనశ్రేణిపై రాళ్లదాడి చేశారు. ఆ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కన్నయ్య కుమార్ సీపీఐ తరఫున బీహార్లోని బెగూసరారు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కన్నయ్యకుమార్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటంతో హిందూత్వ వాదులు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Courtesy: NT