వాషింగ్టన్: కరోనా కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పెల్లుబికాయి. లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ మిచిగన్ రాష్ట్ర రాజధాని లన్సింగ్లో పౌరులు భారీ నిరసన చేపట్టారు. లాక్డౌన్ తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శనలో కొంత మంది ముఖానికి మాస్క్లు ధరించి ఆయుధాలను కూడా కలిగివుండటం కలకలం రేపింది. నిరసనకారులు లెజిస్లేటివ్ భవనంలోకి దూసుకొవెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నిరసన ప్రదర్శనపై మిచిగన్ రాష్ట్ర గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆందోళనను చెత్త జాత్యహంకార ప్రదర్శనగా వర్ణించారు. ప్రజల పప్రాణాలను కాపాడేందుకే తాము లాక్డౌన్ అమలు చేస్తున్నామని, ఇలాంటి నిరసన కార్యక్రమాలు సరికాదని అన్నారు. కొద్దిమంది అభిప్రాయం రాష్ట్రం అంతటికి వర్తించదని, దీనికి ప్రజామోదం లేదని చెప్పారు. కొంత మంది జాత్యహంకారులు ప్రజలను రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆయుధాలు ధరించి నిరసనలో పాల్గొన్న వారు ‘చాలా మంచి ప్రజలు’ అంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కితాబు ఇవ్వడం గమనార్హం.
లాక్డౌన్కు వ్యతిరేకంగా జరుతున్న నిరసనలను ‘వినాశకరమైన ఆందోళన’గా వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోర్డినేటర్ డెబోరహ బిరెక్స్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానుల్లో సాధారణ జీవనం కోసం నిబంధనలను సడిలించాలనే డిమాండ్లతో ప్రజలు నిరసనలు చేస్తున్నారని వెల్లడించారు. నిరసనలు దిగుతున్నవారు ఎలాంటి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయడం లేదన్నారు. ఇలాంటి వారు కరోనా వైరస్కు వాహకులగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా, మిచిగన్లో దాదాపు 44 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4 వేలకు మందిపైగా మరణించారు.