– చేతులెత్తేసిన జీసీఎక్స్ కేబుల్ నెట్వర్క్ సంస్థ
– 35 కోట్ల డాలర్లు చెల్లించడంలో విఫలమై..!!
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్చేంజ్ లిమిటెడ్ (జీసీఎక్స్) దివాలా చట్టం కింద అమెరికాలోని డెలావేర్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఆగస్టు 1 వరకల్లా చెల్లించాల్సిన 7 శాతం మెచ్యూర్ బాండ్స్కు సంబంధించి 35 కోట్ల డాలర్లు(రూ.2450 కోట్లు) చెల్లించడంలో విఫలమైనందున దివాలా చట్టంలోని చాప్టర్ 11 కింద రక్షణ పొందే యత్నం ప్రారంభించింది. సెప్టెంబర్ 15న అమెరికా కోర్టును ఆశ్రయించినవాటిలో జీసీఎక్స్తోపాటు దాని 14 అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. రుణాల ఎగవేతదారుగా మారడంతో జీసీఎక్స్ రేటింగ్కు మూడీ ఇన్వెస్టర్స్ సర్వీస్ కోత పెట్టింది. 68,000 కిలోమీటర్ల సముద్ర అంతర్భాగ కేబుల్ వ్యవస్థతో జీసీఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా వెలుగొందుతోంది. సంస్థ అభివృద్ధి కోసం 75 శాతం రుణదాతలు సానుకూలంగా ఉన్నట్టు జీసీఎక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. జీసీఎక్స్ మాతృసంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారత్లో ఈ ఏడాది ప్రారంభం నుంచే దివాల చట్టం కింద విచారణనెదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారు రూ.40వేలకోట్లమేర రిలయన్స్ కమ్యూనికేషన్స్ అప్పులు చెల్లించాల్సి ఉన్నది. రుణ పరిష్కార ప్రణాళిక కింద అనిల్ గ్రూప్నకు చెందిన రోడ్లు, రేడియో ప్రాజెక్టులకు సంబంధించిన వాటాలు అమ్మడం ద్వారా రూ.21,700 కోట్లు సమకూర్చనున్నట్టు కోర్టుకు తెలిపింది. అనిల్ గ్రూప్నకు చెందిన సంస్థల రుణాల మొత్తం రూ.90వేల కోట్లకుపైగానే ఉన్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
(Courtesy: NT)