న్యూయార్క్: కరోనా మహమ్మారి సోకి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 47 వేలు దాటింది. ఇప్పటివరకు 47,249 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 9,36,237గా నమోదైంది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య స్పెయిన్లోనూ లక్ష దాటింది. అమెరికాలో అత్యధికంగా 2,15,300, ఇటలీలో 110,574, స్పెయిన్లో 104,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఐరోపాలో 30 వేలు దాటిన మరణాలు
కరోనా వైరస్ కారణంగా ఐరోపా దేశాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 30 వేలకు చేరుకుంది. అందులో ఇటలీ, స్పెయిన్లోనే ఎక్కువగా మరణాలు సంభవించిచాయి. 4,58,601 మంది కరోనా బారిన పడతా, 30,063 మంది మృతి చెందారు. ఒక్క ఇటలీలోనే 12,428 మంది మరణించగా, స్పెయిన్లో 8,189 మంది, ఫ్రాన్స్ లో 3,523 మంది మృత్యువాత పడ్డారు. బ్రిటన్లో ఒక్కరోజే 500 మంది చనిపోయారు. బ్రిటన్లో కరోనా బాధితుల సంఖ్య 29,474కు చేరుకుంది.
అమెరికాలో మృత్యుహేల
ఇక అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం ఒక్కరోజే 884 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 5,110 మరణాలు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో కనెక్టికట్ రాష్ట్రంలో ఆరు వారాల శిశువు చనిపోవడం భయాందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలుగా కావడం గమనార్హం. గడచిన 24 గంటల్లో 25 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అమెరికన్లు వణికిపోతున్నారు.
న్యూయార్క్, కనెక్టికట్, న్యూ జెర్సీ రాష్ట్రాల్లో కోవిడ్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో నిర్బంధం అమలు చేస్తున్నారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రానున్న 15 రోజుల్లో అమెరికాలో కోవిడ్ మరణాలు 2 లక్షలకు చేరే అవకాశముందని వార్తలు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా రెండు వారాల పాటు కఠిన, బాధాకర పరిస్థితిని భరించాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పష్టం చేశారు.