– అహ్మదాబాద్లో 85శాతం మందిపై ప్రభావం
– ఐఐఎం-ఏ సర్వేలో వెల్లడి
అహ్మదాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా కేంద్రం విధించిన లాక్డౌన్.. కార్మికులు, రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోనే కూలీలు అనేక కష్టాలను, బాధలను కండ్ల చూస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రధాన నగరం అహ్మదాబాద్లో దాదాపు 85శాతం మంది దినసరి కూలీలు తమ ఆదాయాన్ని కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- అహ్మదాబాద్’ నిర్వహించిన తాజా సర్వేలో ఇది వెల్లడైంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 9 మధ్య నగరంలోని దాదాపు 500 కుటుంబాలలోని కార్మికులు, కూలీలను కలిసి ఐఐఎం-ఏ దీనిని నిర్వహించింది. ఐఐఎం-ఏ రీసెర్చర్స్ బృందం నిర్వహించిన ఈ సర్వేకు ప్రొఫెసర్ అంకూర్ సరీన్ నేతృత్వం వహించారు. అనేక మంది కార్మికులు, కూలీలు తమ ఉపాధిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అనేక కుటుంబాలు తమ నెలవారి ఆదాయాలను కోల్పోయాయి.
దాదాపు 54శాతం కుటుంబాలు ఒక పూట ఖాళీ కడుపుతో ఉంటూ.. రెండు పూటల మాత్రమే ఆకలిని తీర్చుకుంటున్నాయి. లాక్డౌన్ పీరియడ్లో తాము బతకడానికి తమ వద్ద సరిపడా ఫుడ్ రేషన్స్ లేవని 60శాతం మంది ఈ సర్వేలో వెల్లడించారు. ఒకవైపు లాక్డౌన్ కారణంగా వలసకూలీలు, కార్మికులు, పేదల కష్టాలను తీర్చడానికి తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం అంటున్నది. అయితే సాక్షాత్తు మోడీ సొంత రాష్ట్రంలోని కార్మికులు, కూలీలు ఇంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తెలుపుతున్నది. అయితే ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ సర్కారు వెంటనే స్పందించి కూలీలు, కార్మికుల కుటంబాలను ఆదుకోవాలని సామాజికవేత్తలు, పౌరసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Courtesy: NT