– 24 గంటలు.. 26 మంది శరీరాలు ఛిద్రం
– సొంతూర్లకు వెళ్తూ.. చక్రాల కింద నలిగిన వలస కార్మికులు
– వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో వలస కూలీల మృతి
– ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్లో ఘోరాలు
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ఔరంగబాద్ రైలు చక్రాల కింద నలిగిపోయిన వలస కూలీల ఘటన మరువకముందే… దేశంలో ఎక్కడోచోట అలాంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పొట్టచేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళిన వలస కార్మికులు.. ఇప్పుడు సొంతూర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. కాలి బాటన కొందరు… వాహనాల్లో కొందరు… సొంతూళ్ళకు చేరుకునే క్రమంలో ప్రమాదల రూపంలో వారిని మృత్యువు కబళిస్తున్నది.ఏకంగా దేశంలో వేర్వేరు చోట్ల 24 గంటల్లో జరిగిన ప్రమాదాల్లో 26 మందిని మృత్యుశకటాలు పొట్టనబెట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ , యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ చోటుచేసుకున్న నాలుగు వేర్వేరు ప్రమాదాల్లో వలసకార్మికులు మృతిచెందారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఎట్టకేలకు తమవాళ్లను కలుద్దామనుకున్న వలసకార్మికులు రోడ్డుప్రమాదాల్లో చనిపోయారని విషయం తెలియగానే వారి బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
యూపీలో కూలీలపై దూసుకెళ్ళిన బస్సు
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో వలస కూలీల మీదుగా బస్సు దూసుకె ళ్లింది. ఈప్రమాదం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈదారుణ ఘటనలో ఆరుగురు వలసకార్మికులు అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ – షహరన్పూర్ జాతీయరహదారిపై రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీరంతా బీహార్కు చెందినవారుగా గుర్తించారు. పంజాబ్లో రోజుకూలీలుగా పనిచేస్తున్నవీరంతా లాక్డౌన్ నేప థ్యంలో తమస్వస్థలాలకు బయలుదేరారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామనీ, ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్ ఘటనలో 8 మంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునాలో ట్రక్కు – బస్సు ఢ కొన్న ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు. 50 మందిదాకా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 60 మంది వలస కార్మికులు ట్రక్కులో ముంబయికి బయలుదేరింది. అహ్మదాబాద్ నుంచి వస్తున్న బస్సు ట్రక్కును ఢ కొట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది యూపీ లోని ఉన్నావో జిల్లాకు చెందిన కార్మికులని చెప్పారు. గురువారం తెల్లవా రుజామున 2.30 గంటలకు ఘటన జరిగిందనీ, గాయపడిన వారిని ఆస్పత్రి కి తరలించినట్టు గున కలెక్టర్ ఎస్ విశ్వనాథన్ చెప్పారు. అలాగే.. బీహార్లో వలసకార్మికులతో వెళుతున్న బస్సు – ట్రక్కు ఢ కొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు. సమస్తీపూర్ జిల్లా శంకర్ చౌక్లో ఈఘటన చోటుచేసుకున్నది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ముజఫర్పూర్ నుంచి కతిహర్కు 32 మంది వలస కార్మికులతో బయలుదేరిన ట్రక్కును బస్సు ఢ కొన్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం
వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కూలీల మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. మృతులు రాపర్ల సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం వీరిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు, ఓ రైతు ఉన్నారు.
Courtesy: NT